హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): డెంగ్యూపై తెలంగాణ సర్కారు యుద్ధం ప్రకటించింది. డెంగ్యూ నివారణ చర్యలు యుద్ధప్రాతిపదికన చేపట్టేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో డెంగ్యూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీసహా అన్ని కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో జ్వర సర్వే చేయాలని నిర్ణయించింది. సోమవారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టీ హరీశ్రావు, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. డెంగ్యూ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. వైద్యారోగ్యశాఖ, పురపాలక, పంచాయతీరాజ్శాఖలు కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని సూచించారు. డెంగ్యూ నివారణ చర్యల్లో ప్రజాప్రతినిధులకు, ప్రజలకు భాగస్వామ్యం కల్పించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా డెంగ్యూ నివారణపై రూపొందించిన పోస్టర్ను మంత్రి హరీశ్రావు ఆవిష్కరించారు.
నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు
రాష్ట్రంలో ప్రతి ఐదేండ్లకు ఒకసారి డెంగ్యూ కేసులు పెరుగుతుంటాయని, ఇది ఐదో సంవత్సరం కాబట్టి కేసులు కొంచెం పెరిగాయని మంత్రి హరీశ్రావు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో జూలైలో 542 కేసులు, ఆగస్టులో 1,827 కేసులు రికార్డయ్యాయని వెల్లడించారు. కేసులు ఎకువగా నమోదైన ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ అధికారులతో సమన్వయం చేసుకొని వైద్య సిబ్బంది ఇంటింటికీ జ్వర సర్వే నిర్వహించాలని ఆదేశించారు. డెంగ్యూకు కారణమయ్యే మంచినీటి దోమలు పగటి పూటనే కుడతాయని, నీటితొట్లు, కొబ్బరిచిప్పలు, పాత టైర్లు వంటి వాటిల్లో ఇవి పెరుగుతాయని, వీటిల్లో నీరు నిల్వ ఉండకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా పది వేల బ్లడ్ యూనిట్లు సేకరించామని, ప్లేట్లెట్స్ సపరేటర్ మిషన్లు కూడా అందుబాటులో ఉంచామని, ఎంత బ్లడ్ అవసరమైనా ఉచితంగా ఇచ్చేందుకు సిద్ధమని చెప్పారు.
ఉచితంగా పరీక్షలు, చికిత్స
సెప్టెంబర్ 17న హైదరాబాద్, చుట్టుపకల నియోజకవర్గాల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాట్లు చేస్తామని మంత్రి హరీశ్రావు తెలిపారు. జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయకుండా ప్రజలు వెంటనే బస్తీ దవాఖానకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. టీ డయాగ్నోసిస్ ద్వారా ఉచితంగా పరీక్షలు నిర్వహించి, చికిత్స అందిస్తామన్నారు. డెంగ్యూ కేసుల నిర్ధారణకు ర్యాట్కిట్స్ బస్తీ దవాఖానాల్లో అందుబాటులో ఉంచామని చెప్పారు. బస్తీ దవాఖానల వల్ల ఫీవర్, గాంధీ దవాఖానలకు కేసులు తగ్గాయని తెలిపారు. కరోనా వ్యాక్సిన్, బూస్టర్ డోస్ ప్రతి ఒకరికి వేసేందుకు జీహెచ్ఎంసీ, వైద్య సిబ్బంది కలిసి పనిచేయాలని సూచించారు.
పీపీపీలో భాగస్వాములు కావాలి:పురపాలకశాఖ మంత్రి కేటీఆర్
హైదరాబాద్సహా డెంగ్యూ కేసులున్న పట్టణ ప్రాంతాల్లో జ్వర సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. డెంగ్యూ నివారణకు అన్ని మున్సిపాలిటీలు ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు (పీపీపీ) ఇంటిని, పరిసరాలను శుభ్రం చేసే కార్యక్రమం మూడేండ్లుగా విజయవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. పాఠశాల విద్యాశాఖ, పురపాలకశాఖ, మెప్మా, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఇందులో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాలను ప్రజల్లోకి విసృ్తతంగా తీసుకెళ్లేందుకు సెలబ్రిటీలను వినియోగించుకోవాలని, రేడియో, లోకల్ టీవీలు, హోర్డింగ్స్ వంటివి పెట్టి ప్రజలను చైతన్యపర్చాలని సూచించారు.సమీక్షలో మున్సిపల్, పట్టణాభివృద్ధి ప్రత్యేకశాఖ ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ఫ్యామిలీ అండ్ వెల్ఫేర్ డైరెక్టర్ శ్వేతామహంతి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్, వైద్య ఆరోగ్యశాఖ డెరెక్టర్ హెల్త్ శ్రీనివాసరావు, మున్సిపల్, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
కొవిడ్ నుంచి కోలుకున్న కేటీఆర్
.అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్న మంత్రి
హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): మంత్రి కే తారకరామారావు కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఇటీవల కొవిడ్ పాజిటివ్ రావడంతో వైద్యుల సూచన మేరకు ఆయన హోంఐసోలేషన్లో ఉన్నారు. తిరిగి పరీక్షలు నిర్వహించడంతో కొవిడ్ నెగెటివ్గా వచ్చిందని వైద్యులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో మంత్రి సోమవారం డెంగ్యూపై జూమ్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. మంగళవారం నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు కేటీఆర్ హాజరుకానున్నారు.