బాసర ట్రిపుల్ ఐటీ కళాశాలలో శుక్రవారం సాయంత్రం 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మూడు మెస్సుల్లో మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే బాధితులను స్థానిక దవాఖానకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం 30 మందిన నవీపేట్, నిజామాబాద్ దవాఖానలకు తీసుకెళ్లారు. ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. ఘటనపై విచారణ జరిపించాలని ట్రిపుల్ ఐటీ డైరెక్టర్, జిల్లా కలెక్టర్ను ఆమె ఆదేశించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యసేవలందేలా దగ్గరుండి పర్యవేక్షించాలని ఉన్నత విద్యామండలి వైస్చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణకు సూచించారు. స్థానిక ఎమ్మెల్యే విఠల్రెడ్డి కళాశాలకు వచ్చి, ఘటనకు గల కారణాలను తెలుసుకొన్నారు. కళాశాల ఆవరణలోనే వైద్య శిబిరం ఏర్పాటుచేయాలని డీఎంహెచ్వోను కోరారు. ఎస్పీ ప్రవీణ్, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడేతో కలిసి కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థులు క్షేమంగా ఉన్నారని, 15 మందిని నిజామాబాద్ దవాఖానకు తరలించారని తెలిపారు.
బాసర ఘటనపై వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు స్పందించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. ట్రిపుల్ ఐటీ డైరెక్టర్, కలెక్టర్, జిల్లా వైద్యాధికారుల ద్వారా వివరాలుతెలుసుకొన్నారు. కళాశాలకు ప్రత్యేక వైద్య బృందాలను పంపించాలని, నిరంతరం వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలని వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.