జగిత్యాల : ఈ ఎనెల 7న సీఎం జగిత్యాల పర్యటనను విజయవంతం చేయాలని మంత్రులు హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై మంత్రులు సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శాఖలవారీగా అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తించాలని సూచించారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయాలన్నారు.
ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, సీఎం పర్యటన పూర్తి అయ్యే వరకూ విద్యుత్ అంతరాయం లేకుండా ట్రాన్స్కో అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజాప్రతినిధులకు సంబంధిత శాఖల జిల్లా అధికారులకు సకాలంలో పాస్లు అందజేయాలని సూచించారు. అలాగే అగ్నిమాపక శాఖ అగ్నిమాపక శకటాలను సిద్ధంగా ఉంచాలన్నారు. సీఎం పర్యటనకు అంబులెన్స్ను వైద్యారోగ్యశాఖ అధికారులతో అందుబాటులో ఉంచాలన్నారు. ప్రోటోకాల్ ప్రకారం సీటింగ్ కెపాసిటీ ఏర్పాటు చేయాలని రెవెన్యూ అధికారులకు సూచించారు.
సమావేశంలో జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత, కలెక్టర్ జీ రవి, ఎస్పీ సింధూశర్మ, ఎమ్మెల్యే సంజయ్కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ శ్రావణి, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్, జిల్లా అదనపు కలెక్టర్లు మందా మకరంద్, బీఎస్ లత, ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు మంత్రులు మోతో సభాస్థలిని సందర్శించి, బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. వాహనాల రాకపోకల మార్గాలు, పార్కింగ్ ప్రదేశాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, సూచనలు చేశారు.