మహబూబ్నగర్ : సీఎం కేసీఆర్లాంటి నేతను కాపాడుకోవాలని, ఆయనను ఎవరైనా ఏమన్నా అంటే ఉరికించాలని, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. చారిత్రక నేపత్యం ఉన్న ఇనగుర్తి గ్రామం మండలంగా ఏర్పాటైన సందర్భంగా ప్రారంభోత్సవ కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ మంత్రితో కలిసి పాల్గొన్నారు. ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, మాలోత్ కవిత, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, జడ్పీ చైర్పర్సన్ కుమారి బిందు, తెలంగాణ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వీ ప్రకాశ్, మహబూబాద్ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి, కేసముద్రం పీఏసీఎస్ చైర్మన్ ధీకొండ వెంకన్న, సర్పంచ్ దార్ల రాంమూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఇనగుర్తి ప్రారంభ సరిహద్దు తారాసింగ్ బావి వద్ద హనుమాన్ ఆలయంలో పూజలు చేశారు. ఆ తర్వాత భారీ వాహనాలతో, కోలాహలం మధ్య మంత్రులు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచులు, ముఖ్య నాయకులు, శ్రేణులు, అధికారులు పెద్ద ఎత్తున ఇనుగుర్తి మండల కేంద్రానికి ర్యాలీగా వెళ్లారు. మండల ఏర్పాటుకు కృషిచేసిన నాయకులను క్రేన్ సహాయంతో పెద్ద గజమాల వేసి స్థానికులు సన్మానించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించారు. తర్వాత మండల సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతిగృహం వద్ద ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొన్నారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ తెలంగాణలో ఆడపిల్ల పెళ్లి అయితే మేనమామగా రూ.1,00,116 ఇస్తున్న కేసీఆర్ను మరిచిపోదామా? రైతుబంధు కింద ఎకరాకు ఏటా 1.50కోట్ల చొప్పున ఇనగుర్తికి రూ.8కోట్లు ఇచ్చారని, బయట రాష్ట్రాల్లో ఆరు, ఏడు గంటలు కరెంటు ఇచ్చి మీటర్లు పెట్టడంతో రూ.50వేల బిల్లులు చెల్లించాల్సి వస్తుందన్నారు. మన దగ్గర మీటర్లు పెడితే ఏటా రూ.80 నుంచి రూ.90వేలు చెల్లించాల్సి వస్తుందన్నారు. మీటర్లు పెట్టమని బీజేపీ అంటే నా గొంతులో ప్రాణం ఉండగా మీటర్లు పెట్టనని స్పష్టం చేశారన్నారు.
అందుకే ఈడీ, సీబీఐ రవిచంద్ర వంటి నాయకులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ రాక ముందు రూ.లక్ష ఉన్న ఎకరం భూమి ఇప్పుడు రూ.20లక్షలకు పెరిగిందని, కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక ఎన్ని మంచి పనులు జరుగుతున్నాయో గుర్తు పెట్టుకోవాలని, అలాంటి నాయకున్ని కాపాడుకోవాలన్నారు. ఇనగుర్తి మండలాన్ని కాపాడుకునే బాధ్యత తనదని, దత్తత తీసుకొని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఇక్కడ మంచి స్థలం చూసి ఒకే కాంప్లెక్స్లో అన్ని కార్యాలయాలు ఉండేలా ఏర్పాట్లు చేద్దామన్నారు. మంత్రి మండలాన్ని దత్తత తీసుకోవడంతో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ గజమాలతో సత్కరించారు.