హైదరాబాద్ : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, పీడిత ప్రజల పక్షపాతి, శాసనసభ్యురాలిగా సేవలందించిన మల్లు స్వరాజ్యం మృతి బాధాకరమని మంత్రి హరీశ్రావు అన్నారు. ఆమె జీవితం భావి తరాలకు స్ఫూర్తిదాయకమని, మల్లు స్వరాజ్యం ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు. తన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మల్లు స్వరాజ్యం మృతిపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మృతి చెందడం బాధాకరమన్నారు. నమ్మిన సిద్ధాంతాలను చివరి శ్వాస వరకు పాటించిన గొప్ప నాయకురాలని, యావత్ మహిళా లోకానికి వారి మరణం తీరని లోటన్నారు. రెండుసార్లు అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికై విశేష సేవలు అందించారని, అఖిల భారత మహిళ సంఘం (ఐద్వా) అధ్యక్షురాలిగా పని చేసి మహిళల సమస్యలపై పోరాడారని కొనియాడారు.
రైతాంగ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మృతిపై మంత్రి ప్రశాంత్రెడ్డి, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్రావు సంతాపం తెలిపారు. ప్రజల కోసం అలుపెరగకుండా నిబద్ధతతో పనిచేసిన నాయకురాలిగా,రెండు పర్యాయాలు తుంగతుర్తి ఎమ్మెల్యేగా సేవలందించిన ధీరవనిత మల్లు స్వరాజ్యమని ఈ సందర్భంగా ఆమె సేవలు గుర్తు చేసుకున్నారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.
మల్లు స్వరాజ్యం అంతిమ యాత్ర వివరాలు..
ఆదివారం నాడు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు హైదరాబాద్ ఎంబీ భవన్లో, నల్లగొండ పార్టీ కార్యాలయంలో 11 గంటల నుంచి ఒంటి గంట వరకు ప్రజలు సందర్శనార్థం ఉంచనున్నారు. ఒంటిగంటకు నల్లగొండ సీపీఎం కార్యాలయం నుంచి అంతిమయాత్ర బయల్దేరి మూడున్నర గంటలకు మెడికల్ కాలేజీకి పార్థివదేహాన్ని నాయకులు, కుటుంబ సభ్యులు అప్పగించనున్నారు.
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, పీడిత ప్రజల పక్షపాతి, శాసనసభ్యురాలిగా సేవలందించిన మల్లు స్వరాజ్యం గారి మృతి బాధాకరం. ఆమె జీవితం భావి తరాలకు స్ఫూర్తిదాయకం. మల్లు స్వరాజ్యం గారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. pic.twitter.com/ZvKsizGBWe
— Harish Rao Thanneeru (@trsharish) March 19, 2022