హైదరాబాద్ : నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం తిమ్మారెడ్డిపల్లిలో లంబాడీల ఆరాధ్య దైవం గురు లోకమసంద్ మహరాజ్ జాతర ఆదివారం జరిగింది. జాతరకు గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్, స్థానిక ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి, జడ్పీ చైర్మన్ వనజమ్మ లోకమ సంద్ను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. రూ.6.39కోట్లతో తిమ్మారెడ్డిపల్లి వాగు వంతెన, రూ.50లక్షల బావొజీ ఆలయం వద్ద అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు.
అలాగే జాతరకు రూ.15లక్షలు మంజూరు చేశారు. అంతేకాకుండా లంబాడీలు తమ ఆరాధ్య దైవంగా కొలిచే గురు లోకమసంద్ జాతరను రాష్ట్ర జాతరగా జరుపుకునేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని హామీ మంత్రులు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ గతంలో లంబాడీ మహిళలు మంచినీటికి తీవ్ర ఇబ్బందులు పడ్డారని, తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఇంటింటికీ నల్లాలు, విద్యుత్ సౌకర్యం కల్పించి రోడ్లను అభివృద్ధి చేశారని కొనియాడారు. ప్రతి గిరిజన పంచాయతీకి త్వరలో భవన నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
అలాగే కొండంగల్కు గిరిజన గురుకుల పాఠశాల మంజూరు చేయిస్తానని, లోకమ సంద్ జాతరకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు గిరిజన ఆడబిడ్డగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. 16వ శతాబ్దంలో లోకమ సంద్ ఇక్కడ సజీవ సమాధి అయ్యారని, దేశంలోని లంబాడీలకు దార్శనికుడు అన్నారు. జాతర సజావుగా సాగేలా రూ.15లక్షలు మంజూరు చేసినట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో సమ్మక్క – సారక్క జాతర మాదిరిగా రాష్ట్ర జాతరగా నిర్వహించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని హామీ ఇచ్చారు.
జాతరలో వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా మంచినీరు వసతి, మహిళలకు తాత్కాలిక మరుగుదొడ్లు, విద్యుత్ తదితర ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ను ఆదేశించారు. జాతర పూర్తయ్యాక ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తామని, జాతరతో పాటు తండాలకు కావాల్సిన సదుపాయాలపై అధ్యయనం చేసి సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్ హరిచందన దాసరి, ఎస్పీ ఎన్ వెంకటేశ్వర్లు, పాలమూరు యూనివర్సిటీ ఉప కులపతి లక్ష్మీకాంత్ రాథోడ్, డీసీసీబీ చైర్మన్ నిజాం పాషా తదితరులు పాల్గొన్నారు.