భీంగల్ : ఇన్నాళ్లు నిరుపేద ప్రజానీకానికి ఖరీదైన కార్పొరేట్ వైద్యం అందని ద్రాక్షగా ఉండేది. కానీ, సీఎం కేసీఆర్ నిరుపేదల ఆరోగ్యమే ప్రధానంగా వందల కోట్లు వెచ్చించి అత్యాధునిక దవాఖానలు అందుబాటులోకి తీసుకు వస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో వంద పడకల ప్రభుత్వ హాస్పిటల్ను మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి మంత్రి వేముల పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వంద పడకల దవాఖాన తన హయాంలో మంజూరు కావడం సంతోషంగా ఉందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ బాల్కొండ నియోజకవర్గ ప్రజలంటే అత్యంత ప్రేమని చెప్పారు. ఉద్యమ సమయం నుంచి రైతు నాయకుడు దివంగత వేముల సురేందర్ రెడ్డి కేసీఆర్కు సన్నిహితంగా ఉండడంతో ఈ ప్రాంత కష్ట నష్టాలు వారికి బాగా తెలుసన్నారు. అందుకే చెక్ డ్యాంలు, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, రోడ్లు, మున్సిపాలిటీ,100 పడకల దవాఖాన ఇలా ఏది అడిగిన కాదనకుండా ఇచ్చారని గుర్తు చేసుకున్నారు.
వీలైనంత తొందరగా హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేసి పేద ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. వారం పది రోజుల్లో ఆరోగ్య శాఖ మంత్రితో కలిసి భూమి పూజ చేసి పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్సీ కవితకు నియోజకవర్గ ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.