హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): డీఎంఈ పరిధిలోని టీచింగ్ హాస్పిటళ్ల పనితీరు ప్రతి నెలా మెరుగుపడుతున్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అభినందించారు. కాటరాక్ట్, కార్డియాక్, ఈఎన్టీ వంటి సర్జరీలు ఇంకా పెరగాలని ఆదేశించారు. మంగళవారం ఆయన టీచింగ్ హాస్పిటళ్ల పనితీరుపై నెలవారీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. 15 రోజుల్లో అన్ని దవాఖానలకు ఎయిర్ శాంపిలర్లు వస్తాయని, గాలినాణ్యత, స్టెరిలైజేషన్ విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని స్పష్టంచేశారు. ప్రతి దవాఖానలో సుమారు రూ.కోటి నిధులు ఉన్నాయని, వాటిని అవసరాలకు వినియోగించాలని సూచించారు. సూపరింటెండెంట్లు, ఆర్ఎంవోలు రాత్రి వేళల్లో తప్పనిసరిగా రౌండ్స్కు వెళ్లి రోగులతో, వారి సహాయకులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకోవాలని సూచించారు. పేషెంట్లను డిశ్చార్జి చేయడంలో జాప్యాన్ని నివారించాలన్నారు. హాస్పిటళ్లలో నర్సింగ్ స్టాఫ్ 40:30:30 నిష్పత్తిలో మూడు షిప్టుల్లో తగినంత మంది ఉండేలా చూడాలని సూచించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో స్టాఫ్ తక్కువగా ఉంటున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. డైట్, శానిటేషన్ విషయంలో ఫిర్యాదు వస్తే సీరియస్గా తీసుకొని పరిషరించాలని అధికారులను ఆదేశించారు.
టీచింగ్ హాస్పిటళ్లకు సుమారు 800 మంది సీనియర్ రెసిడెంట్లను నియమించామని, ప్రణాళికాబద్ధంగా వారి సేవలు వినియోగించుకోవాలని సూచించారు. త్వరలో 2 వేల మంది పీజీ విద్యార్థులను వివిధ దవాఖానలకు పంపుతామని వెల్లడించారు. గర్భిణుల కోసం 56 టిఫా స్కానింగ్ యంత్రాలు త్వరలో వస్తాయని తెలిపారు. జిల్లా కేంద్రాల్లోని దవాఖానలకు జెరియాట్రిక్ కేర్ సెంటర్లు ఇస్తామని చెప్పారు. సంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో టీ-డయాగ్నస్టిక్ సర్వీసులకు సంబంధించిన సమాచారాన్ని 24 గంటల్లో పంపడంలో రాష్ట్రంలోనే ముందున్నాయని అభినందించారు. నార్మల్ డెలివరీల్లో ఇన్సెంటివ్లు అధికంగా పొందిన సూర్యాపేట, పేట్లబుర్జు, గాంధీ, నిలోఫర్ దవాఖానల సిబ్బందికి అభినందనలు తెలిపారు. అన్ని దవాఖానల ఆర్ఎంవోలు, సూపరింటెండెంట్లు అవయవ దానాన్ని ప్రోత్సహించాలని కోరారు. సమీక్షలో వైద్యశాఖ కార్యదర్శి రిజ్వి, ఆరోగ్య, కుటుంబసంక్షేమశాఖ కమిషనర్ శ్వేతా మహంతి, డీఎంఈ రమేశ్రెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈవో విశాలాచ్చి, టీఎస్ఎంఐడీసీ ఎండీ చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు.