హైదరాబాద్ : గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల బ్రాండ్ను పెంచాలని మంత్రి హరీశ్రావు సూచించారు. శుక్రవారం ఆయన ఆయా దవాఖానల సూపరింటెండెంట్లు, అన్ని విభాగాధిపతులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. డీఎంఈ రమేశ్రెడ్డి, టీఎస్ఎంఐడీసీ ఎండీ చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విభాగాల వారీగా పనితీరును మంత్రి సమీక్షించారు. గత సమీక్షలో తీసుకున్న నిర్ణయాల అమలు పురోగతిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదలకు నాణ్యమైన వైద్యసేవలు అందించే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్యసేవలు అందుబాటులోకి తెస్తున్నారన్నారు. విలువైన వైద్య పరికరాలు సమకూర్చుకోవడం, మందుల కొరత లేకుండా చూసుకోవడంతోపాటు అవసరమైనన్ని నిధులను ప్రభుత్వం ఇస్తుందన్నారు.
రెండు ఆసుపత్రులపై నమ్మకం మరింత పెరిగేలా సేవలందించాలని సూచించారు. చికిత్స విషయంలో కార్పొరేట్ ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోకుండా ఉన్నామని, పేషెంట్లతో ఆప్యాయంగా ఉంటూ వైద్య సేవలు అందిస్తే మరింత మంచి పేరు వస్తుందన్నారు. సిబ్బంది రోగులు, అటెండర్లతో మర్యాదగా వ్యవహరించాలన్నారు. పేసంట్లను హెచ్ఓడీలు పలుకరిస్తూ ఆరోగ్య సేవలు ఎలా అందుతున్నాయో ? అడిగి తెలుసుకోవాలన్నారు. రోగులకు అన్నివేళల్లో అత్యవసర వైద్యసేవలు అందించాలని, ఆరోగ్య శ్రీ, ఆయుష్మాన్ భారత్ కేసులు మరింత పెరగాలన్నారు. ఇతర రాష్ట్రాల వారికి సైతం ఈ పథకంలో భాగంగా చిక్సితలు అందేలా చూడాలన్నారు. కిడ్నీ, మోకాలు, తుంటి ఎముకల మార్పిడి సర్జరీలు పెరగాలన్నారు.
కరోనా బాధిత గర్భిణులకు వైద్య సేవలు అందించిన గాంధీ గైనిక్ విభాగాన్ని మంత్రి అభినందించారు. సీ సెక్షన్ డెలివరీలు తగ్గించి, నార్మల్ డెలివరీలు ఎక్కువగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదే రీతిలో మాతా, శిశు మరణాలు పూర్తిగా తగ్గించాలన్నారు. డెలివరీ జరిగిన వెంటనే కేసీఆర్ కిట్స్ అందించాలన్నారు. మాతా, శిశు మరణాలు, సాధారణ మరణాలు, సీ సెక్షన్లపై ఆడిటింగ్ రిపోర్ట్ సిద్ధం చేయాలన్నారు. సివిల్ వర్క్స్ పనులను రెండు ఆసుపత్రుల్లో వెంటనే పూర్తి చేయాలన్నారు. ఉస్మానియాలో కొత్త మార్చురీ 9 నెలల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. నెలవారీ సమీక్ష ఉంటుందని, విభాగాల వారీగా రిపోర్టులతో సిద్ధంగా ఉండాలని, పని చేసేవారికి తప్పక ప్రత్యేక గుర్తింపు ఉంటుందన్నారు.