నిజామాబాద్ : మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మరోసారి తన ఔదర్యాన్ని చాటుకున్నారు. మంత్రి, తన స్నేహితులతో కలిసి సుమారు కోటిన్నర రూపాయలతో ప్రభుత్వ దవాఖానల్లో ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేశారు. మంగళవారం బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి పర్యటించారు.
కమ్మర్పల్లి, చౌటపల్లి, భీంగల్ పీహెచ్సీలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ బెడ్లు, ఇతర మౌలిక సదుపాయాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి వేముల మాట్లాడుతూ..జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గంలో ఆక్సిజన్ కొరత లేదన్నారు. గత రెండు సంవత్సరాలుగా కొవిడ్ మహమ్మారి ప్రజలను ఎంతగానో ఇబ్బందులు పెట్టిందన్నారు.
ఎందరో పేద ప్రజలు ఆ సమయంలో ఆక్సిజన్ అందక ప్రాణాలను సైతం పోగొట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొవింద్ సెకండ్ వేవ్ అనుభవాల దృష్ట్యా అటువంటి దుస్థితి మళ్లీ రాకూడదన్న ఉద్దేశంతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, తన స్నేహితుల సహకారంతో కోటిన్నర రూపాయలు సమకూర్చారు.
ఆ నిధులతో బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ దవాఖానలలో మౌలిక సదుపాయాలను సమకూర్చారు. అలాగే మోర్తాడ్, బాల్కొండ, వేల్పూర్ లోని హాస్పిటల్స్ లో సుమారు పధ్ధెనిమిది వరకు ఐసీయూ బెడ్లను ఏర్పాటు చేశారు.
వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి తాగు నీటి సౌకర్యం కల్పించారు. బాట్లింగ్ యూనిట్ ఏర్పాటు చేయడం ద్వారా నియోజకవర్గంలోని అన్ని ఆస్పత్రులకు ఆక్సిజన్ సరఫరా చేసే అవకాశం ఏర్పడింది అని మంత్రి అన్నారు.
ఇంతటి గొప్ప పని చెయ్యడానికి అడగ్గానే నాకు సహకరించిన స్నేహితులు, మంత్రి సతీమణికి నియోజకవర్గ ప్రజల తరపున మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సూపరింటెండెంట్ ప్రతిమా రాజ్, డీఎంహెచ్వో సుదర్శన్, డిప్యూటీ డీఎంహెచ్వో రమేష్, తదితరులు పాల్గొన్నారు.