నిజామాబాద్ : గోదావరి నది ఒడ్డున ఆగమ శాస్త్ర ప్రకారం ఎమ్మెల్సీ కవిత కుటుంబ సభ్యులు నిర్మించిన శ్రీ రాజ్యలక్ష్మీ సమేత నృసింహస్వామి ఆలయం గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా నిలువనుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
జిల్లాలోని నందిపేట్ మండలం చౌడమ్మ కొండూరులో ఎమ్మెల్సీ కవిత దంపతులు, వారి కుటుంబ సభ్యులు సంయుక్తంగా నిర్మించిన ఆలయంలో.. రెండో రోజూ కొనసాగుతున్న రాజ్యలక్ష్మీ సమేత నృసింహస్వామి ఆలయ జీర్ణోద్ధరణ, ప్రతిష్ఠాపన కార్యక్రమానికి మంత్రి వేముల హాజరయ్యారు.
ఎమ్మెల్సీ కవిత దంపతులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజా,హోమం కార్యక్రమాల్లో పాల్గొని వేద పండితుల ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఎమ్మెల్సీ కవిత, అనిల్ కుమార్ దంపతులు మంత్రిని సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు, జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ..ఆలయం ఎంతో వైభవంగా నిర్మించారని ప్రశంసించారు.
విగ్రహ ప్రతిష్ఠాపన ఈ నెల 9న జరగనుందని పేర్కొన్నారు. వారి ఇష్టదైవమైన ఈ ఆలయాన్ని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకునే విధంగా ధర్మ పరిరక్షణలో భాగంగా నిర్మించిన ఎమ్మెల్సీ కవిత దంపతులకు, కుటుంబ సభ్యులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.