నిజామాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పోడు పట్టాలతో గిరిజనులకు అస్తిత్వం, భరోసాను కల్పించిన ఘనత సీఎం కేసీఆర్దే నని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Minister Vemula) అన్నారు. బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మండలం తాళ్ళపల్లి గ్రామంలో 1011 మంది గిరిజనులకు పోడు పట్టాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షా 50 వేల మంది గిరిజనులకు 4 లక్షల ఎకరాల పట్టాలు అందజేస్తున్నామని వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాలో 4300 మందికి 8,600 ఎకరాలు అందిస్తున్నామన్నారు. గతంలో వ్యవసాయం చేసుకునే సందర్భంలో అడవి బిడ్డలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. పంట వేసిన నుంచి ధాన్యం చేతికి వచ్చే వరకు ఇబ్బందులు పడ్డారని వెల్లడించారు.అలాంటి పరిస్థితుల నుంచి గౌరవ ప్రదంగా వ్యవసాయం చేసుకునే స్థాయికి తీసుకొచ్చిన ఘనత కేసీఆర్దే నని అన్నారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చినపుడు ఎంత సంతోష పడ్డానో గిరిజనులకు పోడు పట్టాలు ఇస్తున్నపుడు అంతే సంతోషం గా ఉందన్నారు. గిరిజనుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తరువాత జరిగిన మార్పుపై ప్రజల్లో చర్చ జరగాలని పేర్కొన్నారు .గిరిజన తండాలో తీజ్ భవన్ నిర్మించేందుకు సీఎం కేసీఆర్ కు విన్న వించానని త్వరలో అనుమతి వస్తుందని ఆశిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.