బాల్కొండ: తెలంగాణలో వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేసిన ఘనత కేవలం ఒక్క కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం అంక్సాపూర్ గ్రామంలో 13 కోట్ల విలువగల పలు అభివృద్ది పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రికి గ్రామస్తులు డప్పు చప్పుళ్లతో, టపాసులు మోతతో ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని సంత మల్లన్న దేవాలయాన్ని సందర్శించి మల్లన్నకు మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ ఇల వేల్పు అయిన మల్లన్నకు సాష్టాంగ నమస్కారం చేశారు.
అనంతరం సంత మల్లన్న దేవాలయం షెడ్ నిర్మాణానికి (రూ.25 లక్షల వ్యయం), సంతమల్లన్న దేవాలయం గిరి ప్రదక్షిణ రోడ్డు నిర్మాణానికి (వ్యయం రూ.2.20 కోట్లు), అంక్సాపూర్ నుంచి వేల్పూర్ డబుల్ లైన్ రోడ్డు నిర్మాణ పనులకు (రూ.8.10 కోట్ల వ్యయం), అంక్సాపూర్ నుంచి వడ్డెర కాలనీ వయా సంత మల్లన్న రోడ్డు నిర్మాణ పనులకు (రూ.40 లక్షల వ్యయం), హెల్త్ సబ్ సెంటర్ పనులకు (రూ.20 లక్షల వ్యయం), పోచమ్మ దేవాలయం నిర్మాణ పనులకు (రూ.15 లక్షల వ్యయం), హనుమాన్ దేవాలయం నిర్మాణ పనులకు (రూ.30 లక్షల వ్యయం), మంత్రి శంకుస్థాపనలు చేశారు.
ఆ తర్వాత గ్రామ ప్రజలను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. అంక్సాపూర్ గ్రామ అభివృద్ది చూస్తుంటే మనసుకు ఎంతో ఆనందం కలుగుతున్నదని ఆయన హర్షం వ్యక్తం చేశారు. తాను చిన్నప్పుడు సైకిల్ మీద తిరిగిన మట్టి రోడ్డు ఎమ్మెల్యే అయ్యాక డాంబర్ రోడ్డు అయ్యిందని, ఇప్పుడు డబుల్ రోడ్డు అవుతుందని అన్నారు. అంక్సా పూర్ సట్టి తీర్దాలకు ఎడ్ల కచ్చురం మీద వచ్చి మూడు రోజుల పాటు ఇక్కడే తన మేనత్త ఇంట్లో ఉండేవాడినని అప్పటి జ్ఞాపకాలను ఆయన నెమరు వేసుకున్నారు. ఒకప్పటి అంక్సాపూర్ను, ఇప్పటి అంక్సాపూర్ గ్రామాన్ని చూస్తుంటే ఎంతో సంతృప్తి కలుగుతుందని, ఇంతకు మించిన ఆత్మ తృప్తి మరోటి ఉండదని ఆనందం వ్యక్తం చేశారు.
ఈ ఒక్క గ్రామంలోనే 39 కోట్ల అభివృద్ధి చేశామని, 750 మందికి 11 కోట్ల రూపాయల పెన్షన్లు ఇస్తున్నామని మంత్రి తెలిపారు. సొంత జాగ ఉండి ఇండ్లు లేని అర్హులైన పేదలకు విడతల వారీగా, నిరంతరాయంగా గృహ లక్ష్మి పథకం కింద రూ.3 లక్షలు ఇస్తామని చెప్పారు. కేసీఆర్ తోనే తెలంగాణ పల్లెల్లో అసాధారణ అభివృద్ధి సాధ్యమయ్యిందని, కాళేశ్వరం నీళ్లతో ఊర చెరువులు కళకళ లాడుతున్నాయని అన్నారు. అభివృద్ధి, పాడి పంటలు, కుల వృత్తులకు చేయూతతో గ్రామాలు సంబురాలు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సంపద సృష్టించి పేదలకు పంచుతున్నాడని చెప్పారు. రాష్ట్రంలో 36 వేల కోట్ల రైతు రుణమాఫీ ఘనత ఒక్క కేసీఆర్కే దక్కుతుందని, దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇంత సాహసం చేయలేదని అన్నారు.
రైతు బంధు లాంటి పథకంతో రైతులకు ఆర్థిక భరోసా ఇయ్యాలన్న కనీస ఆలోచన ఏ నాయకుడు చేయలేదని మంత్రి వేముల అన్నారు. కానీ ఇప్పుడు మేము కేసీఆర్ కంటే ఎక్కువ చేస్తామంటూ కాంగ్రెస్ వాళ్లు అర్రాసు పాట తీరుగా పథకాలు ప్రకటిస్తున్నారని, కాంగ్రెస్ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్వి గట్టి చేతలు కాంగ్రెస్వి ఉట్టి మాటలని, రామ-రావణ యుద్ధంలో మిగిలిన రాక్షసులు కొంత మంది మనిషి రూపంలో గ్రామాల్లో ఇంకా తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల కథ కూడా ఎంపీ అర్వింద్ బాండ్ పేపర్ లాంటి ఉత్తి మాటే అని విమర్శించారు. ఓట్ల కోసం మాటలు చెప్పే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, గోస పడ్డ జీవితాల్లో వెలుగులు నింపిన కేసిఆర్కు తోడుగా నిలబడాలని మంత్రి వేముల పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కోటపాటి నర్సింహ నాయుడు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఆర్డీవో వినోద్ కుమార్, ఏసీపీ జగదీష్ చందర్, పలువురు మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.