నిజామాబాద్ : సబ్బండ వర్ణాల ఆత్మగౌరవానికి, మహిళా చైతన్యానికి ప్రతీక ధీర వనిత చాకలి ఐలమ్మ అని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. చాకలి(చిట్యాల) ఐలమ్మ వర్ధంతి సందర్భంగా వేల్పూర్ మండల కేంద్రంలో ఆమె విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. జోహార్ చాకలి ఐలమ్మ అని నినదించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెట్టి చాకిరికి వ్యతిరేకంగా, బానిస సంకెళ్ల విముక్తి కోసం పోరాడిన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, ధీర వనిత చాకలి ఐలమ్మ అని మంత్రి వేముల కొనియాడారు. ఆమె పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని చెప్పారు. సమైక్య రాష్ట్రంలో విస్మరణకు గురైన ఐలమ్మను తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక సీఎం కేసీఆర్ వీరనారి ఐలమ్మ వర్ధంతి, జయంతిని అధికారికంగా నిర్వహిస్తూ సరైన గౌరవం కల్పించారన్నారు.
నేడు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో నంబర్ వన్గా నిలుస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. మంత్రి వెంట నివాళులు అర్పించిన వారిలో నిజామాబాద్ డిసిసిబి వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి, రైతు నాయకుడు కోటపాటి నర్సింహనాయుడు, పలువురు రజక నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.