హైదరాబాద్ : వరంగల్లో నూతనంగా నిర్మించబోయే ప్రభుత్వ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం, బిల్డింగ్ డిజైన్, ఇతర అంశాలపై ఆర్ అండ్ బి, మెడికల్ అండ్ హెల్త్ శాఖల అధికారులతో గురువారం నగరంలోని ఎర్రమంజిల్ లోని ఆర్ అండ్ బి కార్యాలయంలో రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వరంగల్లో అత్యధునాతన సౌకర్యాలతో సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని తెలిపారు.
భారత దేశంలోనే అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కట్టిన అనుభవం గల ముగ్గురు ఆర్కిటెక్ట్లతో మంత్రి స్వయంగా మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల మేరకు దేశంలోనే అత్యంత సౌకర్యవంతమైన అన్ని విభాగాల సమూహంతో కూడిన ఆస్పత్రిగా ఉండే విధంగా ప్లాన్లు తయారు చేయించాలని ఆర్కిటెక్ట్ లకు మంత్రి సూచించారు. మంగళవారంలోగా హాస్పిటల్ డిజైన్స్, ఎలివేషన్ లతో కూడిన ప్లాన్స్ సమర్పించాలని మంత్రి ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఖాసీం రిజ్వి, ఆర్ అండ్ బి ఈఎన్సీ గణపతి రెడ్డి, నిమ్స్ డైరెక్టర్ మనోహర్, సూపరింటెండెంట్ సత్యనారాయణ, టీఎస్ఎంఎస్ఐడీసీ డైరెక్టర్ చంద్ర శేఖర్ రెడ్డి, ఆర్ అండ్ బి అధికారులు పాల్గొన్నారు.