నిజామాబాద్ : రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Minister Vemula ) మండిపడ్డారు. ఉచితాలు వద్దంటూ పేదలకు అన్యాయం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కు ఓటేస్తే ఇక 3 గంటల కరెంట్ వస్తుంది . మళ్లీ పాతరోజులు వస్తాయని పేర్కొన్నారు. ఉచితాలు వద్దు అంటున్న రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) కి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని కోరారు.
బీజేపీ (BJP ) మోటార్లుకు మీటర్లు పెట్టాలంటోంది, కాంగ్రెస్ 24గంటల విద్యుత్ వద్దు అంటోంది. ఈ రెండు పార్టీలు ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీని బంగాళాఖాతంలో పాతేయాలని పిలపునిచ్చారు. కాంగ్రెస్ హయాంలో రాత్రి కరెంట్ వల్ల విద్యుత్ ప్రమాదాలకు, పాము కాట్లతో రైతులు చనిపోయేవారని తెలిపారు. కాంగ్రెస్ (Congress )దళారుల కోసం, బీజేపీ ఆదాని, అంబానీ కోసం పనిచేస్తే కేసీఆర్ రైతుల కోసం పనిచేస్తున్నారని వెల్లడించారు.
రేవంత్ మాటలతో కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేకి అని మరోసారి స్పష్టం అయిందన్నారు. రైతులపై అనుచిత వ్యాఖ్యలుచేసిన చంద్రబాబుకు పట్టిన గతే కాంగ్రెస్కు పడుతుందని తెలిపారు. ఉచితాలు వద్దంటున్న రేవంత్ పెన్షన్ లు పెంచుతామని ఎలా ప్రకటించారని ప్రశ్నించారు. రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.