హైదరాబాద్: బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు సర్వాయి పాపన్న అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మొగలాయి దౌర్జన్యాలను ఎదిరించి తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన గొప్ప వీరుడని చెప్పారు. హైదరాబాద్లోని తన అధికారిక నివాసంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మంత్రి పుష్పాంజలి ఘటించారు. తెలంగాణ ప్రజలపై అరాచకాలకు పాల్పడుతున్న మొగల్ పరిపాలన తాలూకు భూస్వాముల గుండెల్లో గునపమయ్యాడని, వ్యక్తిగా మొదలై ప్రజలను చైతన్యం చేసుకుంటూ ఒక సామ్రాజ్యాన్ని స్థాపించిన బహుజన బందూక్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు. తెలంగాణ గడ్డపై పోరాటం మొదలుపెట్టి రాజ్యాన్ని ఏలిన తొలి బహుజన రాజుగా చరిత్రలో నిలిచిపోయారన్నారు. వరంగల్-గోల్కొండ మధ్య 21 కోటలను స్థాపించిన నెలకొల్పారని చెప్పారు.
సీఎం కేసిఆర్ ప్రభుత్వం గౌడ కులవృత్తిని అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నదని వెల్లడించారు. రూ.2 లక్షలుగా ఉన్న ఇన్సూరెన్స్ను రూ.5 లక్షలు చేశామని, తాటి, ఈత చెట్లపై గీత పన్ను పూర్తిగా రద్దు చేశామన్నారు. ప్రత్యేకంగా గీత కార్మికుల సంక్షేమం కోసం నీరా పాలసీ తెచ్చామని, ఆర్థిక భరోసా కోసం ఆసరా పెన్షన్లు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వమే తాటి, ఈత వనాలు పెంచుతూ గౌడ కులవృత్తి వారికి అండగా నిలుస్తుందన్నారు. పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని ప్రభుత్వమే ఏటా అధికారికంగా నిర్వహిస్తోందని చెప్పారు. ఆయన స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం సబ్బండ వర్గాల సంక్షేమం కోసం పని చేస్తున్నదని పునరుద్ఘాటించారు.