మెండోరా/వేల్పూర్, మే 2: ప్రశాంతంగా ఉన్న ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టడం హైందవ ధర్మం కాదని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా మెండోరాలో రూ.40 లక్షల నిధులతో వేంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో కల్యాణ మండపం, ‘మన ఊరు-మన బడి’లో భాగంగా రూ.27 లక్షలతో నూతన గదులు, ప్రహరి నిర్మాణం, ముప్కాల్ మండలంలోని రెంజర్ల ఉన్నత పాఠశాలలో రూ.34 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులు, వేల్పూర్ మండలం కుకునూర్లో ప్రభుత్వ పాఠశాలలో ‘మన ఊరు-మన బడి’లో భాగంగా రూ.75 లక్షలతో పలు అభివృద్ధి పనులకు సోమవారం మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. నిజమైన హైందవ ధర్మం ఆచరించే ఆలయాలు, మండపాలను టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మిస్తున్నదని చెప్పారు. కానీ కొన్ని దుష్టశక్తులు ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి సమాజంలో అశాంతిని నెలకొల్పుతున్నాయని, వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాలువలు కాకతీయ, సరస్వతీ, లక్ష్మి ఆయకట్టుకు ఢోకా లేకుండా పునరుజ్జీవ పథకం దోహదపడిందని పేర్కొన్నారు.