రైతుబంధు వారోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. పంట పెట్టుబడి సాయం ఇచ్చి అప్పుల బాధ నుంచి తమకు విముక్తి కల్పించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు రైతన్నల తరఫున కృతజ్ఞతలు వెల్లువెత్తుతున్నాయి. పంట ఉత్పత్తులు, రంగులతో సీఎం కేసీఆర్ పటాలను రూపొందిస్తూ అభిమానం చాటుకొంటున్నారు. కేసీఆర్ చిత్రపటాలకు క్షీర, ధాన్యాభిషేకాలు చేస్తున్నారు. ఎడ్లబండ్లు, ట్రాక్టర్ల ర్యాలీలతోపాటు ముగ్గుల పోటీలను సంబురంగా నిర్వహిస్తున్నారు.
నమస్తే తెలంగాణ నెట్వర్క్, జనవరి 12: స్వరాష్ట్రంలో అన్నదాతల అప్పుల బాధలు తీర్చింది ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. తెలంగాణలో రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తున్న రైతుబంధు పథకం ప్రపంచంలో ఎక్కడా లేదని స్పష్టంచేశారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూరులో బుధవారం రైతుబంధు వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ట్రాక్టర్లు, ఎడ్లబండ్లతో రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతులు అప్పులపాలు కావొద్దనేదే సీఎం కేసీఆర్ లక్ష్యమని అన్నారు. రైతుల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.3 లక్షల కోట్లు వెచ్చించిందని చెప్పారు. ఉచిత విద్యుత్తు కోసం రూ.50 వేల కోట్లు, సాగునీళ్ల కోసం రూ.1.80 లక్షల కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. రైతుబంధు పథకం ద్వారా ఎనిమిది విడుతల్లో రైతులకు రూ.50 వేల కోట్ల నగదును పంపిణీ చేయడం చరిత్రాత్మకమని చెప్పారు.
సీఎం కేసీఆర్పై అవాకులు చెవాకులు పేలుతున్న పీసీపీ చీఫ్ రేవంత్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యవహార శైలిపై మంత్రి వేముల మండిపడ్డారు. రేవంత్రెడ్డి బుడ్డర్ఖాన్, బండి సంజయ్ మెంటల్ఖాన్ అని.. ఎంపీ అర్వింద్కు తల లోపల ఏమీ లేదని ఎద్దేవాచేశారు. తెలంగాణలో అమలుచేస్తున్న రైతుబంధు, సాగు నీరు.. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఇస్తున్నట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తానని.. లేదంటే అర్వింద్, సంజయ్ రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. గెలిచిన 5 రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని మాయ మాటలు చెప్పి మాట తప్పిన వ్యక్తి అర్వింద్ అని అన్నారు. కేసీఆర్ను జైల్లో పెడుతామంటూ మాట్లాడుతున్న బీజేపీ నాయకులు.. జైలుకు ఎవరు పోయారో ఆలోచించుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్పై ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్న బీజేపీ ముఖ్యమంత్రులు.. తమ రాష్ట్రంలోని పరిస్థితులను, తెలగాణలోని అభివృద్ధితో పోల్చిచూసుకోవాలని చురకలు వేశారు. సీఎం కేసీఆర్ను విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బాండ్పేపర్ రాసిచ్చి మాటతప్పిన వాడిది మగతనమా అని ఘాటుగా విమర్శించారు. త్వరలోనే ప్యాకేజీ 21 ద్వారా ఎకరా మిగలకుండా నీళ్లు అందిస్తామని తెలిపారు.
రైతుబంధు సంబురాలు ఊరూరా ఉత్సాహంగా జరుగుతున్నాయి. బుధవారం నల్లగొండ, నిజామాబాద్, రంగారెడ్డి, మంచిర్యాల జిల్లాల్లో ఎడ్లబండ్ల ర్యాలీలు, ట్రాక్టర్ల ప్రదర్శనలు నిర్వహించారు. వికారాబాద్ జిల్లా బంట్వారంలో రైతు బంధు సంబురాల్లో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పాల్గొన్నారు. రైతును రాజును చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని, అందుకోసమే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో ప్రభుత్వ విప్ బాల్కసుమన్ ఆధ్వర్యంలో 500 ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చిన రైతు బాందవుడు సీఎం కేసీఆర్ అని బాల్క సుమన్ పేర్కొన్నారు.
కరోనాతో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైన సమయంలోనూ సీఎం కేసీఆర్ అన్నదాతలకు రైతుబంధు అందించారని, పండించిన ప్రతి గింజ కొన్నారని మండలి మాజీ చైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి తెలిపారు. బుధవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో నిర్వహించిన రైతుబంధు సంబురాల్లో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డితో కలిసి పాల్గొన్నారు. రైతులు రాజులాగా బతకాలనే ఆలోచనతో రైతుబంధు, రైతుబీమా అందించిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నోటికి ఎంతవస్తే అంత మాట్లాడుతున్నాడని, తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఉన్నాయా అనేది ఆయన తెలుసుకుంటే మంచిదన్నారు.