సిటీబ్యూరో, జూన్ 11 (నమస్తే తెలంగాణ): వర్షాకాలం సమీపిస్తుండటంతో నీటిశుద్ధిపై జలమండలి దృష్టి సారించింది. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నీటి సరఫరాలో తలెత్తే సమస్యలపై ముందే అంచనా వేసిన జలమండలి అధికార యంత్రాంగం ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా వర్షాకాలంలో నీటి సరఫరాలో ఏ మాత్రం తేడా వచ్చినా ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతున్న క్రమంలో అప్రమత్తమైన అధికారులు ప్రస్తుతం సంస్థ పరిధిలో 290 క్లోరినేషన్ పాయింట్లు ఉండగా అదనంగా మరో 20పాయింట్లను ఏర్పాటు చేయనున్నారు. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల వద్ద అత్యున్నత ప్రమాణాలతో శుద్ధి చేయడంతో పాటు క్లోరినేషన్ ప్రక్రియను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూపు ద్వారా నిత్యం ఉన్నతాధికారులు పర్యవేక్షించనున్నారు.
కృష్ణా, గోదావరి, మంజీరా, సింగూరు నుంచి తరలిస్తున్న జలాలను మార్గమధ్యంలో క్లోరినేషన్ చేస్తుంటారు. చివరగా సరఫరా చేసే ముందు నగరంలోని సర్వీసు రిజర్వాయర్ల వద్ద మరోసారి క్లోరిన్ కలుపుతుంటారు. నిబంధనల ప్రకారం మిలియన్ లీటర్ల శుద్ధికి కిలో క్లోరిన్ కలపాల్సి ఉంటుంది. అప్పుడే రిజర్వాయర్ వద్ద 2 పీపీఎం (పార్ట్ ఫర్ మిలియన్) ఉంటుంది. వినియోగదారుడికి చేరే సమయంలో క్లోరిన్ శాతం 0.5 పీపీఎం ఉంటే చాలు. అంతకంటే తక్కువ ఉంటే ఆ నీరు సురక్షితం కానట్టే. రిజర్వాయర్లలో నీటి నిల్వ సమయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా.. క్రిమికీటకాలు వృద్ధి చెందే అవకాశం ఉంది. నీటిలో క్లోరిన్ రెండు, మూడు రోజులు మాత్రమే ఉంటుంది. తిరిగి మళ్లీ కలిపితేనే ఆ నీటి నాణ్యత మెరుగుపడుతుంది. అందుకే క్లోరినేషన్కు నిర్ణీత ప్రామాణిక విధి విధానాలు ప్రకటించిన అధికారులు నిర్వహణలో పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.
వర్షాకాలం సీజన్లో సుమారు రూ.5 లక్షలు వెచ్చించి బస్తీలలోని ప్రతి ఇంటికి 20 క్లోరిన్ బిళ్లలను జలమండలి అధికారులు సరఫరా చేయనున్నారు. అంతేకాక నీటి సంబంధ వ్యాధులను నివారించడానికి స్వయం సహాయక బృందాలు ఇంటింటికీ వెళ్లి నీటి పరీక్షలు చేయనున్నారు. నీటి కాలుష్య ప్రాంతాలను గుర్తించి శాంపిళ్లను సేకరించి.. సరఫరా అయ్యే నీటిలో క్లోరిన్ శాతం తక్కువగా ఉంటే వెంటనే చర్యలు తీసుకోనున్నారు. మరోవైపు జూన్, జులై నెలల్లో ప్రతి బస్తీల్లో రెండు వేల క్లోరిన్ బిళ్లలను ఉచితంగా పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా 2500 ప్రాంతాల్లో నీటి శాంపుల్స్ సేకరణ జరుగుతున్నదని.. దవాఖానలు, బస్తీల్లో నీటి సరఫరాపై ప్రధానంగా దృష్టి సారించామని జలమండలి అధికారులు పేర్కొంటున్నారు.
నగరంలో తాగునీరు, సివరేజీ పైప్లైన్లు పక్కపక్కనే ఉండడం, లీకేజీలు ఏర్పడిన సందర్భాల్లో మురుగునీరు వచ్చి చేరుతుంది. దీంతో నీరు కాలుష్యంగా మారి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. నీటి కాలుష్యంపై నెలకు (గత లెక్కల ప్రకారం) సరాసరి 700 నుచి 800 ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో శిథిలమైన పైప్లైన్ వ్యవస్థ..పారిశుధ్య లోపం.. రసాయన వ్యర్థాలు వెదజల్లే అనేక వ్యాపార సముదాయాలపై జలమండలి అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. మెట్రో కస్టమర్ కేర్ (ఎంసీసీ), డయల్ యువర్ ఎండీ, మీటర్ యువర్ ఎండీ కార్యక్రమాల ద్వారా కలుషిత నీటిపై ఫిర్యాదులు స్వీకరిస్తున్న అధికారులు ప్రస్తుతం వెనువెంటనే పరిష్కరించే లక్ష్యంతో పని చేస్తున్నట్లు జల మండలి ఎండీ దానకిశోర్ ‘నమస్తే
తెలంగాణ’కు తెలిపారు.