నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూలై 25: అల్పపీడన ప్రభావంతో రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో చాలా ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో కుంభవృష్టి వానలు కురిశాయి. మరో మూడు జిల్లాల్లో అత్యంత భారీ, ఐదు జిల్లాలో అతి భారీ, పది జిల్లాలో అక్కడక్కడ వానలు పడ్డాయి. నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో రాత్రంతా కురిసిన వానలకు జనజీవనం స్తంభించి పోయింది.
అనేక చెరువులు, కుంటలు రాత్రికి రాత్రే నిండిపోయాయి. వాగులు పొంగిపొర్లాయి. మహబూబ్నగర్ జిల్లాలో ప్రమాదవశాత్తు వాగులో పడి ఇద్దరు విద్యార్థినులు మరణించారు. కరీంనగర్ జిల్లాలో పిడుగుపడి ఇల్లు ధ్వంసమైంది. రాజేంద్రనగర్లో పిడుగు పడిన ప్రాంతానికి పొరుగున ఉన్న ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు దగ్ధమయ్యాయి. పలు జిల్లాలో 2 రోజులు బడికి సెలవు వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటన ఆన్లైన్ తరగతులకు పలు స్కూళ్ల ఏర్పాట్లు రాబోయే 3 రోజులు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం బుధ, గురు వారాల్లో సెలవు ప్రకటించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
సీడీఎంఏ కార్యాలయంలో కంట్రోల్ రూం
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు మసబ్ట్యాంకులోని సీడీఎంఏ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. 040- 23120410 ఫోన్ నంబర్కు జీహెచ్ఎంసీ కాకుండా ఇతర 141 మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో ఏమైనా సమస్యలు ఎదుర్కొంటే ప్రజలు ఫిర్యాదు చేయవచ్చు. ఈ నెల 28వ తేదీ వరకు 24 గంటలపాటు ఈ కంట్రోల్ రూం పనిచేయనున్నది.
3 షిఫ్టుల్లో లాగ్అవుట్
ఐటీ కారిడార్ ఉద్యోగులందరూ ఒకేసారి రోడ్లపైకి రావడంతో వర్షాల వేళ ట్రాఫిక్ రద్దీ ఎక్కువవడంపై సైబరాబాద్ పోలీసులు దృష్టి సారించారు. ఐటీ ఆఫీసులు 3 షిఫ్టుల్లో పని ముగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వరద ప్రవాహానికి అనేక రోడ్లు దెబ్బతిన్నాయి. చాలాచోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వానలు, వరద పరిస్థితులను మంత్రులు క్షేత్రస్థాయిలో ఉండి పర్యవేక్షిస్తున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్కు నివేదిస్తూ.. సహాయ చర్యలను అధికా రులకు పురమాయిస్తున్నారు. వారం రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలకు చెరువులు మత్తడి దుంకుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జిల్లాల్లో ఎలాంటి సహాయం అయినా అందించడానికి సీడీఎంఏ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు ఏర్పాటుచేశారు.
ట్రాఫికర్కు చెక్.. 3 విడతల్లో టెకీల లాగ్ఔట్
భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్లోని ఐటీ కంపెనీలకు పోలీసులు ప్రత్యేక సూచనలు జారీ చేశారు. నగరంలోని ఐటీ కంపెనీలు 3 విడతల్లో లాగ్ఔట్ చేయాలని పోలీసులు సూచించారు. ఐకియా-సైబర్ టవర్స్ వరకు ఐటీ ఆఫీసుల్లో మధ్యాహ్నం 3 గంటలకు లాగ్ఔట్ చేయాలని సూచించింది. ఐకియా-బయోడైవర్సిటీ వరకు ఐటీ కార్యాలయాల్లో సాయంత్రం 4.30 గంటలకు, ఐకియా-రాయదుర్గం వరకు ఐటీ ఆఫీసుల్లో సాయత్రం 4.30 గంటలకు లాగ్ఔట్ చేయాలని సూచించింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని ఐటీ ఆఫీసుల్లో మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల మధ్య లాగ్ఔట్ చేయాలని పోలీసులు సూచించారు. గచ్చిబౌలిలోని ఐటీ ఆఫీసుల్లో మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల మధ్య లాగ్ఔగౌట్ చేయాలని సూచించారు. తద్వారా ట్రాఫిక్ సమస్య కొంత తీరుతుందని పేర్కొన్నారు.
లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు
భారీ వానకు వరంగల్ జిల్లా అతలాకుతలమైంది.సంగెం మండలంలో 218.4 మి.మీ వర్షం కురిసింది. నర్సంపేట- నెక్కొండ ప్రధాన రహదారిలో వరంగల్- ఖమ్మం జాతీ య రహదారిలో, వర్ధన్నపేట రూటులో రాకపోకలు ఆగిపోయాయి. వర్ధన్నపేట మండలం ఇల్లందలో ఇండ్లలోకి నీరు రావటంతో మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే అరూరి రమేశ్ క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించి అప్రమత్తం చేశారు. భారీ వర్షాలకు హనుమకొండ, వరంగల్ పరిధిలో నీట మునిగిన ప్రాంతాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాసర్ పర్యటించారు. మంచిర్యాలలోని రాళ్లవాగుపై నిర్మించిన కాజ్వేపై రోడ్డు కొట్టుకుపోయింది. జంగాల్పేట నుంచి నెన్నెలకు వస్తున్న కొద్దని సమ్మయ్య ఎర్రవాగు కల్వర్టుపై దాటుతూ జారీ పైపులో పడిపోగా, స్థానిక యువకులు కాపాడారు. సిద్దిపేట జిల్లాలో మో యెతుమ్మెద వాగు పొంగిపొర్లుతుండటంతో బస్వాపూర్ వంతెన వద్ద సిద్దిపేట-హన్మకొండ రహదారిపై వాహనాల రాకపోలు నిలిచిపోయాయి. ఖమ్మం జిల్లాలో మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తున్నది. పాలేరు, వైరా, లంకాసాగర్ రిజర్వాయర్లు నిండుకుండలను తలపిస్తున్నాయి. చెరువు కట్టలు, చెక్డ్యాంలు, కాలువల తూములను ఇరిగేషన్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి మంగళవారం సాయంత్రం 5 గంటలకు 38.8 అడుగులకు నీటిమట్టం పెరిగింది. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో అత్యధికంగా 147.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలోని కృష్ణానది వంతెనపై లారీలు ఇరుక్కు పోవడంతో 5 గంటలు ట్రాఫిక్ జామైంది.
ఉప్పరపల్లి వద్ద కుంగిన రైల్వే ట్రాక్
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూర్-పెద్దపల్లి రైల్వేస్టేషన్ల మధ్య ఉప్పరపల్లి రైల్వే గేట్ వద్ద ట్రాక్ బేస్ మంగళవారం కుంగిపోయింది. దీంతో రైళ్ల రాకపోకలను గంటకు పైగా నిలిపివేశారు. రైల్వే సిబ్బంది హుటాహుటిన ఉప్పరపల్లి గేట్ వద్దకు చేరుకుని యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టారు. ఆ ప్రాంతంలో హెచ్చరిక సూచనలు జారీ చేసి రైళ్ల వేగాన్ని తగ్గించి నెమ్మదిగా పంపిస్తున్నారు.
వాగులో పడి ఇద్దరు విద్యార్థినుల మృతి
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని కొండేడులో మంగళవారం ఇద్దరు విద్యార్థినులు ప్రమాదవశాత్తు వాగులో పడి మరణించారు. కొండేడు గ్రామానికి చెందిన పడకంటి అనూష, పడకంటి స్వాతి కలిసి తమ పత్తి పొలంలో కలుపు తీసేందుకు బయలుదేరారు. గ్రామశివారులోని వాగు దాటుతుండగా.. ప్రమాదవశాత్తు అందులో జారిపడ్డారు. గ్రామస్తులు వాగు వద్ద ఉన్న బండరాయిపై టవల్, టిఫిన్ బాక్సులు పడి ఉండటాన్ని గమనించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. గ్రామానికి చెందిన యువకులు వాగులోకి వెళ్లి యువతుల మృతదేహాలను వెలికితీశారు. అనూష టెన్త్, స్వాతి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నారు.
వేల్పూర్ 6 గంటల్లో రికార్డు వాన
నిజామాబాద్ జిల్లాలో కుండపోతను మించిన వర్షం కురిసింది. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి స్వగ్రామం వేల్పూర్ మండల కేంద్రం లో ఆరు గంటల్లోనే 463.5 మిల్లీమీటర్ల రికార్డు వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాల వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వేల్పూర్లో రిలీఫ్ క్యాంప్ ఏర్పాటు చేశారు. వేల్పూర్, భీమ్గల్, మోర్తాడ్, కమ్మర్పల్లి, ఆర్మూర్ మండలాల్లోని పలు ప్రాం తాల్లో రాత్రంతా కురిసిన వానలతో ఊహించని వరద వచ్చింది. రాష్ట్రంలో 8 చోట్ల రెడ్జోన్లను ప్రకటిస్తే అందులో పెర్కిట్, వేల్పూర్, కోనసముద్రం, జక్రాన్పల్లి, భీమ్గల్.. ఐదు ప్రాంతాలు నిజామాబాద్ జిల్లాలోనివే. పోటెత్తిన వరద రోడ్లను కమ్మేయడంతో నిజామాబాద్ – కరీంనగర్ ప్రధాన రహదారి మూసుకోపోయింది. రోడ్డు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి హుటాహుటిన తన నియోజకవర్గానికి మంగళవారం ఉదయమే వచ్చారు. తన స్వగ్రామం వేల్పూర్లో వరదతో తెగిన చెరువు కట్టలను కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతుతో కలిసి పరిశీలించారు. ఇంతటి వానను తానెప్పుడూ చూడలేదంటూ మంత్రి వేముల తెలిపారు. భారీ వర్షానికి 14 పంచాయతీ రోడ్లు, 23 ఆర్అండ్బీ రోడ్లు 9 చెరువులు 2 కెనాల్స్ ధ్వంసమయ్యాయన్నారు. 5 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వివరించారు.