హైదరాబాద్, మే 28, (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ విధించిన గడువులోగా తెలంగాణ అమరుల స్మారక చిహ్నంతో పాటు సచివాలయ నిర్మాణం పనులు పూర్తి కావాలని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. అమరుల స్మారక చిహ్నం, సచివాలయ పనుల పురోగతిపై శనివారం అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. సచివాలయం పనుల్లో వేగం పెంచాలని, మూడు షిఫ్టుల్లో పనులు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా ఎలివేషన్, జీఆర్సీ క్లాడింగ్ పనుల్లో వేగం పెంచాలని, గ్రాండ్ ఎంట్రీ నిర్మాణం ఫినిషింగ్పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
స్మారక చిహ్నం నిర్మాణం తెలంగాణ ప్రజల సెంటిమెంట్ అనే విషయాన్ని గుర్తుంచుకొని అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పారు. పచ్చదనం, ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు అమరుల త్యాగాలు ప్రతిబింబించే విధంగా స్మారక చిహ్నం తుది మెరుగులు ఉండాలని సూచించారు. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద సందర్శకులు నివాళులు అర్పించే విధంగా తగు ఏర్పాటుచేయాలని సూచించారు. కరోనా, అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా స్టీల్ ప్యానెళ్ల దిగుమతి ఆలస్యం అవుతున్నదని, దీంతో పనులు నెమ్మదించాయని అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దుబాయ్ నుంచి ప్రత్యేకంగా తెప్పిస్తున్న అరుదైన స్టెయిన్లెస్ స్టీల్ ప్యానెల్ త్వరగా దిగుమతి అయ్యేలా అధికారులు చొరవ చూపాలని మంత్రి సూచించారు. అనంతరం మంత్రి నూతన సచివాలయం నిర్మాణ పనులను పరిశీలించారు. డోమ్ అమరిక పనులను పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఈఎన్సీ గణపతిరెడ్డి, ఈఈ శశిధర్, వాస్తు నిపుణుడు సుధాకర్ తేజ పాల్గొన్నారు.