హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆర్అండ్బీ రోడ్లు అద్దంలా తయారవుతున్నాయని, అదేస్థాయిలో వర్షాల వల్ల పాడైన అన్ని రోడ్లను కూడా తీర్చిదిద్దాలని రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో ఆర్అండ్బీశాఖశాఖ ఉన్నతాధికారులతో మంత్రి వేముల సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా అధిక వర్షాల వల్ల దెబ్బతిన్న 1,172 పీరియాడికల్ రెన్యువల్ రోడ్ల మరమ్మతు పనుల కోసం రూ.2,858 కోట్లను సీఎం కేసీఆర్ మంజూరు చేశారని చెప్పారు.
ఈ పనులపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారని, ఆయన విధించిన నిర్ణీత గడువులోగా పనులు పూర్తి కావాలని సూచించారు. ఇప్పటికే రూ.518 కోట్లతో 1393 కిలోమీటర్ల పొడవున రోడ్ల మరమ్మతులు పూర్తి చేశామని, రూ.1,223 కోట్లతో 455 రోడ్ల పనులు (2,700 కి.మీ) వచ్చే 45 రోజుల్లో పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. 60 వర్ ఏజెన్సీలు రోడ్ల మరమ్మతులు చేస్తున్నాయని, ప్రతి ఏజెన్సీతో క్షేత్రస్థాయిలో సమీక్షించి గడువులోగా పనులు పూర్తయ్యేలా చూడాలని సూచించారు. ప్రతివారం తానే స్వయంగా రోడ్ల పనుల పురోగతిని పరిశీలిస్తానని చెప్పారు. సమీక్షలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్, తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి, ఆర్అండ్బీ కార్యదర్శి శ్రీనివాసరాజు, ఈఎన్సీ రవీందర్రావు, డీసీ దివాకర్, ఎస్ఈ వసంత్నాయక్ తదితరులు పాల్గొన్నారు.