వేల్పూర్ ,ఆగస్టు 10 : పసుపు బోర్డు తెచ్చి రైతులకు మేలుచేస్తానని అబద్ధాలు చెప్పి.. బాండ్ పేపర్ రాసిచ్చి.. దగా చేసిన మోసగాడు ఎంపీ అర్వింద్ అని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లోనూ దేశంలోనే నెంబర్ వన్గా అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్, పారిశ్రామిక రంగాన్ని రాష్ట్ర నలుమూలలకూ విస్తరించిన కేటీఆర్, కవిత, తనపై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండలం లక్కోరలోని ఓ ఫంక్షన్హాల్లో 1400 మంది యువతీ, యువకులకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉచిత డ్రైవింగ్ లైసెన్స్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేంద్రం ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.86 వేల కోట్లు ఇచ్చిందని పార్లమెంట్ సాక్షిగా బీజేపీ ఎంపీ అర్వింద్ పచ్చి అబద్ధాలు మాట్లాడారని, కాళేశ్వరం ప్రాజెక్టు కోసం మోదీ ప్రభుత్వం ఏకాణా ఇవ్వలేదని మంత్రి స్పష్టం చేశారు. సంస్కారం లేకుండా తిడుతూ.. అబద్ధాలతో నిత్యం ప్రజలను మభ్యపెడుతున్న శాడిస్ట్ ఎంపీ అర్వింద్కు యువతే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.