నిజామాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిజామాబాద్ సభలో పచ్చి అబద్ధాలు మాట్లాడాడని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి(Minister Vemula Prashanth Reddy) విమర్శించారు. అవినీతికి కేరాఫ్ అయిన మోదీ(Prime Minister Modi).. సీఎం కేసీఆర్పై అవినీతి ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. నీకు (ప్రధాని) దమ్ముంటే చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించు. లేకపోతే తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో మంత్రి బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. మోదీపై నిప్పులు చెరిగారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రిపై ప్రధాని స్థాయి వ్యక్తి ఆరోపణలు చేయడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. అసలు మోదీయే అత్యంత అవినీతిపరుడని అంతర్జాతీయ మీడియా సంస్థలు కోడై కూస్తున్నయాన్నారు.
దేశంలో ప్రభుత్వ సంస్థలన్నీ తన మిత్రుడు ఆదానీకి అప్పనంగా కట్టబెడుతున్నాడని, ఆస్ట్రేలియా బొగ్గు గనులు, శ్రీలంక పవర్ ప్రాజెక్టులు మోదీ ప్రమేయంతోనే వచ్చాయని ఆ దేశాలకు చెందిన అత్యున్నత వ్యక్తులే బహిరంగంగా చెప్పారని, అక్కడి దేశ ప్రజలకు పెద్ద ఎత్తున బయటకు వచ్చి నిరసనలు తెలిపారని గుర్తు చేశారు.
మోదీ సచ్చీలుడైతే అవి అబద్ధాలని నిరుపించాలని డిమాండ్ చేశారు. మరోసారి అధికారం ఇవ్వండి.. అవినీతిని అంతం చేస్తానని ప్రధాని చెప్పిండు. ఈ పదేండ్లు ఏం జేసినవ్ గడ్డి పీకినవా..నువ్ అవినీతిని అంతం చేసే మొనగాడివి అయితే, నీకు దమ్ము, ధైర్యం ఉంటే మొదలు అదానీ అక్రమాలపై విచారణ జరిపించాలని సవాల్ విసిరారు.
రూ.12 లక్షల కోట్ల ప్రజల సోమ్మును తన కార్పొరేట్ మిత్రుల కోసం రుణమాఫీ చేశాడని దుయ్యబట్టారు. అలా అక్రమంగా వచ్చిన సొమ్ముతో ఎనిమిది రాష్ర్టాలలో స్థానిక ప్రభుత్వాలను కూల్చారని మండిపడ్డారు. తెలంగాణలో ఒక్కో ఎమ్మెల్యేను రూ.100 కోట్లకు కొంటామని బీఅజేపీ పంపిన స్వాముల వీడియో రికార్డులు దేశ ప్రజలంతా చూశారని గుర్తు చేశారు.
కేసీఆర్కు ఎన్డీయేలో కలిసే అవసరం లేదని, బీజేపీ వాళ్లు ఎన్నిసార్లు అడిగినా మీ ప్రతిపాదనను కేసీఆర్ రిజెక్టు చేశాడని వెల్లడించారు. కేటీఆర్ సీఎం కావడానికి బోడీ మోదీ ఆశీర్వాదం అవసరం లేదు. కేసీఆర్ ఆశీర్వదిస్తే కేటీఆర్ సీఎం అవుతారు తప్పా మోదీ అవసరం, బోడీ ఆశీర్వాదం అవసరం లేదన్నారు. మాకు 100 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. సీఎం కావడానికి 60 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం సరిపోతుందని తెలిపారు.