మహబూబ్నగర్, (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/దేవరకద్ర, మే 8: తొమ్మిదేండ్ల కిందటి వరకు వలసలకు పెట్టింది పేరైన పాలమూరు.. నేడు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్ల వలసలు పూర్తిగా తగ్గించుకొని.. ఉద్యోగాలిచ్చి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగిందని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలో రూ. 24.5 కోట్లతో నిర్మించిన ఆర్వోబీ, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని మంత్రులు ప్రశాంత్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి ప్రారంభించారు. అనంతరం దేవరకద్రలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి వేముల మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నీరసించిపోయిందని, రాహుల్గాంధీ ఎంపీ పదవిని దుర్మార్గంగా మోదీ తొలగించినా పార్టీ నేతలు నోరు మెదపలేని స్థితికి దిగజారారని ఎద్దేవా చేశారు.
ఢిల్లీలో ఆయన ఉన్న ఇం టి నుంచి బలవంతంగా బయటకు పంపారని, ఇంత జరుగుతున్నా శ్రేణుల్లో చడీచప్పుడు లేదని విమర్శించారు. రేవంత్ ఓ బ్లాక్మెయిలర్ అని విరుచుకుపడ్డా రు. మోదీ అంత అవినీతి, అసమర్థ ప్రధానిని గతంలో ఎప్పుడూ చూడలేదని చెప్పారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర ధరలు పెంచినోడు సమర్థుడా? అసమర్థుడా? ప్రజలే నిర్ణయించాలని కోరారు. క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. 70 ఏండ్లు పాలించిన నాయకులు పాలమూరు జిల్లాకు చేసిందేమిటనో చెప్పాలని డిమాండ్ చేశారు. ఓట్లు వేయించుకొని పబ్బం గడిపారే తప్ప ప్రజల బాగోగులు పట్టించుకోలేదని విమర్శించారు. వాహనదారులు, ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆర్వోబీ గురించి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్తో మాట్లాడారని తెలిపారు.