బీర్కూర్, ఆగస్టు 26: బీజేపీ అక్రమ కేసులకు భయపడేది లేదని, వారి దుర్మార్గాలను కచ్చితంగా ప్రజల పక్షాన ప్రశ్నిస్తామని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి స్పష్టంచేశారు. ప్రజాసంక్షేమాన్ని మరిచి బీజేపీలు నాయకులు కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీకుతున్నట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ మాటలు చెప్పడం తప్పితే దేశానికి చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. బాన్సువాడను అభివృద్ధికి చిరునామాగా మార్చిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిపై విమర్శలు చేస్తున్న బీజేపీ నాయకులపై మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్కు సమీపంలో బాన్సువాడ-జుక్కల్ నియోజకవర్గాలను కలిపేలా రూ.48.50 కోట్లతో మంజీరా నదిపై నిర్మించిన వంతెనతోపాటు పలు అభివృద్ధి పనులను స్పీకర్ పోచారంతో కలిసి శుక్రవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా బీజేపీ తీరుపై వేముల విరుచుకుపడ్డారు. ‘బీజేపీలోకి రండి.. లేదంటే జైలుకు వెళ్లండి’ అనే నినాదంతో కమలం పార్టీ పని చేస్తున్నదని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిలో దేశంలోనే నంబర్వన్గా నిలిచిందని స్పష్టంచేశారు. మోదీ దోస్త్ అదానీ ఆదాయం ఎనిమిదేండ్లలో రూ.50 వేల కోట్ల నుంచి 11 లక్షల కోట్లకు పెరిగిందని.. పేదల ఆదాయం మాత్రం అంతే ఉన్నదన్నారు. పచ్చగా ఉన్న దేశాన్ని మత విద్వేషాలతో మంట గలుపుతున్న వారిని ప్రశ్నించడం తప్పుగా భావిస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీలో చేరకుంటే ఈడీ దాడులతో బెదిరిస్తున్నారని, బీజేపీలో చేరితే అన్ని కేసులు మాఫీ అవుతున్నాయని ఆరోపించారు. కేంద్రాన్ని నిలదీస్తున్న కేసీఆర్ను అడ్డుకొనేందుకు ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
స్వరాష్ట్రంలోనే సంక్షేమ పాలన: స్పీకర్
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కాకముందు తెలంగాణ ప్రజలు సవతితల్లి ప్రేమలో బతికారని, స్వరాష్ట్రంలో నేడు సంక్షేమ పాలన అమలవుతున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నా రు. ఉమ్మడి రాష్ట్రంలో తాను మంత్రిగా పనిచేశానని, ఇప్పుడు వచ్చినన్ని నిధులు తాను ఎప్పుడు కూడా చూడలేదని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు బాన్సువాడ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు రూ.500 కోట్లు ఖర్చు చేసినట్టు స్పష్టంచేశారు. కాంగ్రెస్ హయాం లో నియోజకవర్గానికి ఏడాదికి కేవలం రూ.50 లక్షల నిధులు మాత్రమే వచ్చేవని గుర్తుచేశారు. రైతులను ముంచేందుకే మోటర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నదని ఆరోపించారు. సమాజంలో అశాంతిని నెలకొల్పి, ఘర్షణ వాతావరణాన్ని సృష్టించేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని.. ఆ కుట్రలను తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.