హైదరాబాద్ : వరంగల్లో నూతనంగా నిర్మించబోయే ప్రభుత్వ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం, బిల్డింగ్ డిజైన్, ఇతర అంశాలపై ఆర్ అండ్ బి, మెడికల్ అండ్ హెల్త్ శాఖల అధికారులు, ప్రముఖ ఆర్కిటెక్ట్ లతో రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి బుధవారం నగరంలోని ఎర్రమంజిల్ ఆర్అండ్బీ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. భారత దేశంలోనే అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కట్టిన అనుభవం గల ఆర్కిటెక్ట్లతో మంత్రి సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా ఆర్కిటెక్ట్ లు రూపొందించిన పలు డిజైన్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రి పరిశీలించారు. హైదరాబాద్ సంస్థ అయిన అమేయ డిజైన్, ఆర్కాప్(ARCOP)ఆర్కిటెక్ట్స్ ఢిల్లీ, డిజైన్ అసోసియేట్స్ నోయిడా రూపొందించిన డిజైన్లను మంత్రి పరిశీలించారు. డిజైన్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా నిర్మాణంలో తెలంగాణ సంస్కృతికి దగ్గరగా ఉండేలా స్వల్ప మార్పులు మంత్రి సూచించారు. ఈ నెల 28వ తేదీలోగా మార్పులతో హాస్పిటల్ డిజైన్స్, ఎలివేషన్ లతో కూడిన పూర్తి ప్లాన్స్ను సీఎంకు సమర్పించాలని మంత్రి ఆదేశించారు.
ఈ సమీక్షా సమావేశంలో కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కరుణాకర్ రెడ్డి, ఆర్ అండ్ బీ ఈఎన్సీ గణపతి రెడ్డి, నిమ్స్ డైరెక్టర్ మనోహర్, సూపరింటెండెంట్ సత్యనారాయణ, టీఎస్ఎంఎస్ఐడీసీ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, డీఎంఈ రమేష్ రెడ్డి, పలువురు డాక్టర్లు, ఆర్ అండ్ బి అధికారులు, ఆర్కిటెక్ట్ లు అమేయ డిజైన్ ఎమ్.శ్రీనివాస్, హరిత, ఆర్కాప్ ఆర్కిటెక్ట్ విక్రమ్ సైనీ, డిజైన్ అసోసియేట్ సంస్థ ఆర్కిటెక్ట్ సుమేరెదార్ పాల్గొన్నారు.