వేల్పూర్, సెప్టెంబర్ 20 : ముఖ్యమంత్రి కేసీఆర్ చేసేది చెప్తాడు.. చెప్పింది చేస్తాడు. అలవికానీ వాగ్దానాల జోలికి వెళ్లకుండా ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెసోళ్ల లెక్క బక్వాస్, బోగస్ హామీలు ఇవ్వడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఏమీ ఇవ్వరు. ఇక్కడ మాత్రం అలవికానీ అమలు ఇస్తున్నారని మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని పడగల్ గ్రామంలో ప్రభుత్వం నూతనంగా నిర్మించిన రెండు పడక గదుల ఇళ్ల సముదాయాన్ని బుధవారం ప్రారంభించిన మంత్రి లబ్ధిదారులతో కలిసి ప్రత్యేక పూజలు చేసి పాలు పొంగించారు.
అనంతరం నిర్వహించిన సభలో ఇళ్ల పత్రాలను అందించి మాట్లాడారు. డబుల్ బెడ్ పథకంలో ఎలాంటి పైరవీలకు తావు లేకుండా పూర్తి పారదర్శకంగా లబ్ధిదారులకు ఎంపిక చేశామన్నారు. గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ అని, అర్హులైన ప్రతి కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేస్తామని భరోసా ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వ పాలనలో పేదవారికే ప్రాధాన్యం తప్పా, పైరవీలకు ఏమాత్రం అవకాశం ఉండదని స్పష్టం చేశారు.
మలివిడత ఉద్యమం సందర్భంగా ఎంతో బలవంతులైన తెలంగాణ వ్యతిరేక శక్తులను ఎదుర్కొని ఉద్యమనేత కేసీఆర్ ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించి ప్రజల ఆకాంక్షను నెరవేర్చారని గుర్తు చేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలన్న ఆకాంక్షతో అనేక సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబానికి ఏదో రూపంలో లబ్ధి చేకూరుస్తున్నారన్నారు. ఇచ్చిన హామీకి కట్టుబడి కొంత ఆలస్యమైనప్పటికీ అన్ని వసతులతో కూడిన డబుల్ బెడ్ ఇళ్లను నిరుపేదలకు అందిస్తున్నామన్నారు.
ఎంపీ అర్వింద్ గతంలో బాండ్ రాసిచ్చి, అబద్ధపు హామీతో ఓట్లు దండుకున్నాడు. ఆ తర్వాత ప్రజలను మోసం చేసి తప్పించుకు తిరుగుతున్నాడు. కాంగ్రెస్,బీజేపీ పార్టీలతో తెలంగాణకు మేలు జరగదు.కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష. ప్రజలు వాస్తవాలను గుర్తించి అభివృద్ధి, సంక్షేమానికి పాటుపడుతున్న కేసీఆర్ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలువాలని కోరారు.