ఏర్గట్ల/వేల్పూర్, జనవరి 22 : ప్రజలకు మేలు చేయాలని ఎంపీ అర్వింద్కు చెప్తే తనపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నాడని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. తనను తిట్టినా పర్వాలేదు కానీ ప్రజలకు మంచి చేయాలని సూచించారు. నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల, ఇబ్రహీంపట్నం మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాజకీయాలకతీతంగా అభివృద్ధి పరుగులు పెడుతున్నదని అన్నారు.
ఆదివారం ఒక్కరోజే ఏర్గట్ల మండలంలో సుమారు రూ.6 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసినట్టు చెప్పారు. అభివృద్ధి చేస్తున్నది ఎవరు?.. మాటలు చెప్తున్నది ఎవరనేది ప్రజలు ఆలోచించాలని కోరారు. కులమతాల మధ్య చిచ్చుపెట్టి సమాజాన్ని విడగొట్టే మాటలు మానుకోవాలని అర్వింద్కు హితవు పలికారు. పసుపు బోర్డు తెస్తానని దొంగ బాండ్ పేపర్ రాసిచ్చి.. పసుపునకు రూ.10 వేల మద్దతు ధర ఇప్పిస్తానని రైతులను మోసం చేశాడని దుయ్యబట్టారు.
దొంగ హామీలతో గెలిచిన అర్వింద్తో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ప్రైవేటు దవాఖానల్లో చికిత్స చేసుకున్న పేదలకు సీఎంఆర్ఎఫ్ కింద ఆర్థిక సాయం చేస్తున్నామని తెలిపారు.. ఈ రకంగా తాను ఒక్క బాల్కొండలోనే 10 వేల మందికి రూ.40 కోట్లు ఇప్పించినట్టు చెప్పారు. అలాగే కేంద్రం స్థాయిలో ప్రధానిని అడిగి ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి పేదలకు ఏమైనా ఆర్థిక సహాయం చేయాలని అడిగినంత మాత్రానా.. బేవకూఫ్ అని నోటికొచ్చినట్టు తిడుతున్నాడని అన్నారు. అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని తెలిపారు. ప్రజలకు అన్ని అర్థమవుతున్నాయని, ఎవరు బేవకూఫ్ అనేది త్వరలోనే నిర్ణయిస్తారని అన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన కేసీఆర్ ప్రభుత్వానికి లేదని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు.