హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అభినవ అంబేద్కర్ అని, దేశంలో ఏ నాయకుడు ఆలోచించని విధంగా పేద, వెనుకబడిన వర్గాల సంక్షేమం గురించి ఆలోచించారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్లోని మంత్రుల నివాస ప్రాంగణంలో తెలంగాణ ప్రజాసంఘాలు, వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించతలపెట్టిన ‘ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాద సభ’ పోస్టర్ను ఎంపీ బీబీ పాటిల్తో కలిసి మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తు, ప్రజల సమస్యల పరిష్కారం కోసం సీఎం కేసీఆర్ నిరంతరం ఆలోచిస్తున్నారని తెలిపారు.
బీఆర్ఎస్ ఏర్పాటు దేశరాజకీయాల్లో సంచలనమయ్యిందని చెప్పారు. ప్రజాసంఘాల ప్రతినిధులు గజ్జల కాంతం, బొంకూరి సురేందర్, వేముల భాస్కర్, తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గంధం రాములు మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడ లేనివిధంగా హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఏర్పాటు చేయించారని, తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టారని, అమరవీరుల స్మృతివనం ఏర్పాటు చేయిస్తున్నారని.. వీటన్నింటికి కృతజ్ఙతగా తాము ఈ నెల 16న సభ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ‘చలో ఇందిరా పార్క్’పేరుతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.