చౌటుప్పల్: ప్రధాని నరేంద్ర మోడీని ఎదిరించే దమ్ము ముఖ్యమంత్రి కేసీఆర్కు మాత్రమే ఉందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. చౌటుప్పల్ మండలం డి నాగారం గ్రామంలో స్థానిక టీఆర్ఎస్ నేతలతో కలిసి బీజేపీ దిష్టిబొమ్మను మంత్రి దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ఆటలు తెలంగాణలో సాగవన్నారు. మోడీని ఎదిరించే దమ్మున్న మొనగాడు కేసీఆర్ ఒక్కరే అన్నారు.
‘‘18వేల కోట్లకు అమ్ముడుపోయిన రాజగోపాల్ రెడ్డిలాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అమ్ముడుపోరు. మా ఎమ్మెల్యేలు నిఖార్సైన తెలంగాణ బిడ్డలు. బీజేపీ ప్రలోభాల కుట్రను బట్టబయలు చేసి యావత్ తెలంగాణ సమాజంలో శెభాస్ అనిపించుకున్నారు. మోడీ, అమిత్ షా భారత దేశం వారి జాగీర్ అయినట్టు వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తుంటే దేశ వ్యాప్తంగా ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది. దీన్ని తట్టుకోలేక ఈ కుట్రకు పూనుకున్నారు. నలుగురు ఎమ్మెల్యేలను కొని ఇక్కడ ఏమో జరుగుతుందని తెలంగాణ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కో ఎమ్మెల్యేకు 100 కోట్లు కాంట్రాక్టులు ఇస్తామని ప్రలోభ పెట్టారన్నందుకు అన్ని ఆధారాలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను కూల దోసినట్టు తెలంగాణలో చేస్తామంటే… బిడ్డా మీ ఆటలు ఇక్కడ సాగవు. ఇది కేసీఆర్ అడ్డా’’ అంటూ హెచ్చరించారు.
దేశంలో మోడీ, అమిత్ షా అవినీతిని సీఎం కేసీఆర్ ఒక్కరే ప్రశ్నిస్తున్నారని మంత్రి అన్నారు. అందుకే తెలంగాణను అస్థిరపరిచేందుకు కుట్రకు తెరలేపారని మండిపడ్డారు. ప్రజల చేత ఎన్నుకోబడిన మహారాష్ట్ర, గోవా, మధ్యప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలను అక్రమంగా కూలదోశారని విమర్శించారు. కార్పొరేట్ మిత్రులకు రూ.12 లక్షల కోట్లు బ్యాంకు రుణాలు మాఫీ చేసి.. అక్రమంగా వచ్చిన సొమ్ముతో ఎమ్మెల్యేలను కొంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.