నిజామాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా తెలంగాణపై గజనీ మహమ్మద్ మాదిరిగా దండయాత్ర చేస్తున్నారని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఎద్దేవా చేశారు. సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజలు జాతీయ జెండాలు పట్టుకొని సమైక్యతా భావాన్ని చాటి చెప్తే.. అమిత్షా మాత్రం పరేడ్గ్రౌండ్లో తెలంగాణ మీద కవాతు చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని దూషించేందుకు ఆయన ఎవరని ప్రశ్నించారు. ఆదివారం ఆయన నిజామాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. అమిత్షా పద్ధతి మార్చుకోవాలని, లేదంటే తెలంగాణ ప్రజలు మట్టి కరిపించి గుజరాత్కు పంపిస్తారని హెచ్చరించారు.
ఆయనకు శనికాలం వచ్చి, విపరీత బుద్ధి దాపురించిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ అసమర్ధతను, అవినీతిని సీఎం కేసీఆర్ ప్రశ్నిస్తుండటంతోనే జీర్ణించుకోలేక బీజేపీ మంత్రులు మిడతల దండు మాదిరిగా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ పరిస్థితి దేశంలో ఎక్కడైనా ఉన్నదా? అని ప్రశ్నించారు. తనకు నచ్చని రాష్ట్ర ప్రభుత్వాలపైకి కేంద్ర మంత్రులను, గవర్నర్లను ఉసిగొల్పుతున్నారని చెప్పారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హితవు చెప్పారు. ‘మిడతల దండు మాదిరిగా ఏ రాష్ట్రంలోనైనా పోయిండ్రా. ఇక్కడికే ఎందుకు వస్తున్నారు? మమ్మల్ని బతకనీయరా?’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధాని మోదీ నీచ రాజకీయాలు మానుకోవాలని హితవు చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్సీ రాజేశ్వర్, ఎమ్మెల్యే గణేశ్ గుప్తా పాల్గొన్నారు.