బాల్కొండ : తెలంగాణ ప్రభుత్వం కులవృత్తులకు ఆర్థికంగా తోడ్పాటునందించే కార్యక్రమం చేపట్టిందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి(Minister Vemula Prashant Reddy) అన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండలో జరిగిన సంక్షేమ సంబురాల్లో పాల్గొని గొల్ల కురమలకు రెండో విడుత గొర్రెల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం కేసీఆర్(CM KCR)కంటే గొప్పగా ఎవరూ ఆలోచన చేయలేరని స్పష్టం చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi ) సొంత రాష్ట్రం గుజరాత్లో ఇస్తున్న పెన్షన్ 750 మాత్రమే. అదే ఉత్తరప్రదేశ్లో 500 మాత్రమే అని చెప్పారు. గుజరాత్లో పెన్షన్ల కోసం నెలకు 100 కోట్లు ఖర్చు చేస్తుంటే, కేసీఆర్ తెలంగాణలో ప్రతి నెలా 1000 కోట్లు ఖర్చు చేస్తున్నారని వివరించారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించే బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పేదల కోసం చేస్తున్నది ఏమీ లేదని మండిపడ్డారు.
దేవుడి పేరు, దేశం పేరు మీద మహిళలను, యువకులను మభ్యపెట్టే పనులకు పూనుకున్నారని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీసీ కులవృత్తుల వారికి లక్ష రూపాయల చొప్పున చెక్కులు పంపిణీ చేశారు.