భీమ్గల్(నిజామాబాద్) : సమైక్య పాలనలో నిరాదరణకు గురైన చెరువులు, వట్టిపోయిన బోర్లు, కరెంటు కష్టాలను సీఎం కేసీఆర్ దార్శనికతతో శాశ్వత పరిష్కారంమయిందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Minister Vemula Prashanth Reddy) అన్నారు. రాష్ట్ర సాధన కోసం పడిన కష్టానికి ప్రతిఫలం దక్కిందడానికి చెరువు గట్లపై ఊరూరా ఉత్సవాలు నిర్వహించుకోవడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.
నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం పురాణిపేట గ్రామ చెరువు వద్ద నిర్వహించిన చెరువుల పండుగ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్(CM KCR) ప్రభుత్వం రైతాంగానికి చేస్తున్న మేలు దేశంలోని మరే ప్రభుత్వం చేయడం లేదని అన్నారు. ఆయన సారథ్యంలో సంక్షేమం,అభివృద్ధి అగ్రపథంలో పయనిస్తున్నదని చెప్పారు. చెరువుల అభివృద్ధి వల్ల రైతులకే కాకుండా మత్స్యకారులు, రజకులకే కాకుండా వివిధ వర్గాలకు ఉపాధి మెరుగు పడుతుందన్నారు.
మిషన్ కాకతీయ(Mission Kakatiya) ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 45వేల చెరువులను పునరుద్ధరించడం ఫలితంగానే ప్రస్తుతం మండుటెండల్లోనూ చెరువులు జలకళతో అలుగులు పారుతున్నాయన్నారు. ఉత్తర తెలంగాణకు జీవనాడిగా ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఏడాది మొత్తం నిండుగా ఉండాలనే తపనతో సుమారు రూ.2 వేల కోట్లు వెచ్చిస్తూ పునర్జీవ పథకం ద్వారా కాళేశ్వరం జలాలను మళ్లించామన్నారు.