హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): ధాన్యం, సన్న బియ్యం టెండర్ల ఆరోపణలపై సమాధానం చెప్పలేక మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తికమకపడ్డారు. ఆయన మాటలను ఆయనే ఖండించుకోవడం గమనార్హం. మీడియా అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్పిన ఆయన పలుమార్లు నీళ్లు నమిలారు. తనపై వచ్చిన ఆరోపణలను కప్పిపుచ్చుకునేందుకు నానాతంటాలు పడ్డారనే అభిప్రాయాలు విలేకరుల్లో వ్యక్తమైంది. పైపైకి నవ్వుతూ ఆయన పడిన తిప్పలు చూసి మీడియా ప్రతినిధులు అయ్యో పాపం అనటం గమనార్హం.
ఒక్క సన్న ధాన్యం గింజ అమ్మలేదు
ఫిబ్రవరిలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన ధాన్యం టెండర్లలో సివిల్ సైప్లె 12వ లాట్లో 1.59 లక్షల టన్నుల సన్నధాన్యాన్ని వేలం వేసింది. ఈ ధాన్యాన్ని హిందూస్థాన్ ఎంటర్ప్రైజెస్ సంస్థ క్వింటాలు రూ.2,259కు కొనుగోలు చేసింది. అయితే, సన్నధాన్యాన్ని గింజ కూడా అమ్మలేదని మంత్రి చెప్పారు. అమ్మకపోతే.. ఆయన శాఖ ఆధ్వర్యంలో అమ్మిన ఈ సన్నధాన్యం ఎవరిదో? ఆయనే చెప్పాలి.
టెండర్లు పిలిచాం.. రద్దు చేశాం
గురుకులాలు, హాస్టళ్లు, మధ్యాహ్న భోజనం కోసం అవసరమని ఇటీవల పౌరసరఫరాల సంస్థ 2.20 లక్షల టన్నుల సన్నబియ్యం కొనుగోలుకు టెండర్లు వేసింది. ఈ టెండర్లలో నాలుగు సంస్థలు పాల్గొనగా అన్ని సంస్థలు దాదాపు కేజీ రూ.57 చొప్పున టెండర్ వేశాయి. అయితే బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం కేజీ రూ.42కే లభిస్తుండగా రూ.57కు టెండర్ రావటంపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ టెండర్లలో రూ.300 కోట్ల కుంభకోణం జరిగిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేపీపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆరోపించారు. సన్నధాన్యం కొనుగోలు చేయనప్పుడు ఈ టెండర్లు ఎందుకు పిలిచారో మంత్రికే తెలియాలి. మళ్లీ ఆయనే.. టెండర్లు రద్దు చేశామని తెలిపారు. ఏ టెండర్లు రద్దుచేశారో మంత్రి చెప్పాల్సిన అవసరం ఉన్నది.
రికార్డుల్లో మిల్లర్ల వద్ద ధాన్యం ఉంది
టెండర్ల ద్వారా విక్రయించిన ధాన్యం మిల్లుల్లో లేదంటూ వస్తున్న ఆరోపణలపై మీడియా ప్రశ్నించగా.. సమాధానం చెప్పలేక మంత్రి ఉత్తమ్ నీళ్లు నమిలారు. ఇందుకు సంబంధించి భిన్న సమాధానలు చెప్పారు. మిల్లర్ల వద్ద ధాన్యం ఉన్నట్టు తమ రికార్డుల్లో ఉన్నదని ఓసారి, ధాన్యం అమ్మేసిన తర్వాత ప్రభుత్వానికేం సంబంధం అని మరోసారి వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం దగ్గర పెట్టుకొని ఇప్పుడు ప్రభుత్వానికి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ మంత్రి మరోసారి సమాధానం చెప్పారు.
నిజాయితీపరులైతే వాటిపై చర్యలేవి?
టెండర్లలో విక్రయించిన ధాన్యం నిబంధనల ప్రకారం ఈ నెల 23 వరకు పూర్తిగా లిఫ్ట్ చేయాలి. కానీ ఇప్పటి వరకు కొంత ధాన్యమే ఎత్తారని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డే స్వయంగా చెప్పారు. గడువు పూర్తయినా ధాన్యం ఎత్తని కంపెనీలపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. చర్యలు తీసుకోకపోవటం వెనుక ఆంతర్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. నిజాయితీపరులం అని చెప్పుకొనే మంత్రి.. తన సొంత శాఖకు నష్టం జరుగుతుంటే ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారు? అని నిలదీస్తున్నారు.