హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ) : వచ్చే వానకాలం సీజన్ నుంచి రాష్ట్రంలో పంటల బీమాను అమ లు చేయనున్నట్టు వ్యవసాయ శాఖ మం త్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. కొత్త బీమా పథకాన్ని అన్ని పంటలకు వర్తింపజేస్తామని, రైతుల వాటా ప్రీమి యం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. పంట నష్టాన్ని కచ్చితత్వంతో అంచనా వేసేందుకు ఎస్-టెక్, విండ్స్, క్రాపిక్, శాటిలైట్ ఇమేజ్ అప్లికేషన్స్, డేటాను వినియోగించనున్నట్టు తెలిపారు. తక్షణ పంట నష్టం అంచనా వేసి పరిహారాన్ని డీబీటీ ద్వారా అందిస్తామని తెలిపారు.
రైతులకు పంటల సాగులో మేలైన సాగు పద్ధతులను నేర్పించడంతో పాటు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు అన్ని రైతు వేదికల్లో రైతునేస్తం పేరుతో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2061 రైతువేదికలుండగా తొలి దశలో 110 చోట్ల కార్యక్రమాన్ని చేపడతామని, బుధవారం సచివాలయం నుంచి సీఎం రేవంత్రెడ్డితో కలిసి ‘రైతునేస్తం’ను ప్రారంభించనున్నట్టు తెలిపారు. ప్రతి మంగళవారం, శుక్రవారం వ్యవసాయ యూనివర్సిటీ నుంచి శాస్త్రవేత్తలు, ఆదర్శరైతులు ఆయా గ్రామాల్లోని రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి సందేహాలను నివృత్తి చేయడంతో పాటు కొత్త సాగు విధానాలు, పంటలపై అవగాహన కల్పిస్తారని తెలిపారు.