హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): పంట ఉత్పత్తులను సకాలంలో రైతుల నుంచి సేకరించి రైతులకు అండగా నిలబడాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఆదేశించారు. శుక్రవారం తన నివాసంలో మార్క్ఫెడ్ కార్యకలాపాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎరువుల సరఫరా, పంట ఉత్పత్తుల కొనుగోళ్లు, రైతులకు సకాలంలో మద్దతు ధర అందించడం వంటి అంశాలపై మంత్రి చర్చించారు.
ఇతర రాష్ర్టాల సమన్వయంతో పంట ఉత్పత్తుల డిమాండ్లను అధ్యయనం చేయాలని, మెరుగైన విధానాలు రూపొందించాలని చెప్పారు. సహకార సంఘాల ద్వారా రైతులకు అవసరమైన అన్నిరకాల ఎరువులను అందుబాటులో ఉంచి రైతులకు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మార్క్ఫెడ్ సంస్థ నష్టాలను తగ్గించుకొని, లాభాలు గడించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో మార్క్ఫెడ్ జనరల్ మేనేజర్ విష్ణువర్ధన్రావు, ప్రొక్యూర్మెంట్ మేనేజర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.