హైదరాబాద్, మే 22(నమస్తే తెలంగాణ): ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని, ఒకవేళ అమలు చేయకుంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడగబోమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే హామీల అమలు ప్రక్రియను ప్రారంభించి చూపించామని ఒక ప్రకటనలో తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంతో పోల్చితే కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం, ధాన్యం సేకరణ వెయ్యి రెట్లు నయంగా ఉన్నదంటూ రైతులు అభిప్రాయపడుతున్నారని చెప్పారు.
గతంతో పోలిస్తే ముందస్తుగానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అదనంగా కొనుగోలు చేసినట్టు తెలిపారు. రైతులు పంట అమ్ముకున్న ఐదు రోజుల్లోనే వారి ఖాతాల్లోకి నగదు జమ చేస్తున్నామని, గతంలో 45 రోజుల సమయం పట్టేదని పే ర్కొన్నారు. వానకాలం రైతుల ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించి పంట బీమా పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. తడిచిన ధాన్యా న్ని సైతం ప్రభుత్వం సేకరిస్తున్నదని పేర్కొన్నారు. మనకు అవసరమైనంత సన్న వడ్లను ఉత్పత్తి చేసుకునేందుకే సన్నాలకు రూ.500 బోనస్ పథకాన్ని ప్రవేశపెట్టినట్టు తెలిపారు.