Rythu Bandhu | ఇక నుంచి పంట వేసిన వారికే పెట్టుబడి సాయం అందిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టంచేశారు. రైతుబంధు ఎవరికి ఏ విధంగా ఇవ్వాలనే అంశంపై వచ్చే శాసనసభ సమావేశాల్లో చర్చించి విధివిధానాలు రూపొందిస్తామని అన్నారు. వివిధ వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు. ఈ నెలాఖరు వరకు అర్హులందరికీ రైతుబంధు సాయాన్ని అందజేస్తామని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల సన్నాయిగూడెంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో కోటీ 11 లక్షల యాభై వేల ఎకరాలకు గాను 64.77 లక్షల మంది రైతులకు రూ.5,574.77 కోట్ల రైతుబంధు సాయాన్ని జమ చేశామని తుమ్మల నాగేశ్వరరావు వివరించారు. మరో 4 లక్షల మందికి ఈ నెలాఖరు లోగా అందిస్తామని అన్నారు. ఈ ఏడాది చివరి నాటికి సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను వైరా రిజర్వాయర్కు తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోవత్సం నాటికి వైరా రిజర్వాయర్లోకి గోదావరి జలాలను తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు.