హైదరాబాద్: రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలంటే కారు గుర్తుపై ఓటేసి BRS పార్టీని మరోసారి గెలిపించాలని హైదరాబాద్ నగర ఓటర్లకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాతనే హైదరాబాద్ నగరం ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పారు. గడిచిన తొమ్మిదిన్నర సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో ఎవరూ ఊహించని స్థాయిలో ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి చేశారని పేర్కొన్నారు.
రోడ్ల విస్తరణ, అభివృద్ధి, ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణం కోసం నూతన రోడ్ల నిర్మాణం, అండర్ పాస్ లు, ప్లై ఓవర్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని వివరించారు. అదేవిధంగా గత ప్రభుత్వాల హయాంలో నిరాధరణకు గురైన పార్కులను కూడా ఎంతో అభివృద్ధి చేసి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. తాగునీటి సమస్యను కూడా పరిష్కరించారని చెప్పారు. ఊరూరా వైకుంఠదామాలను నిర్మించారన్నారు. ఇవే కాకుండా శాంతిభద్రతల నిర్వహణ బేస్షుగ్గా ఉందని తెలిపారు. 24 గంటల విద్యుత్, ప్రభుత్వ పరంగా అవసరమైన సహకారాన్ని అందిస్తుండటంతో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చి IT రంగ పరిశ్రమల ఏర్పాటు జరిగిందని పేర్కొన్నారు.
ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి పనులతో హైదరాబాద్ నగరం అద్భుతమైన నగరంగా రూపుదిద్దుకున్నదని తలసాని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ నగరం గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. పెన్షన్ లు, కళ్యాణలక్ష్మి, KCR కిట్ వంటి సంక్షేమ కార్యక్రమాల అమలులో సైతం తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. ఇలాంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఇక ముందు కూడా కొనసాగడానికి ఈ నెల 30వ తేదీన జరిగే ఎన్నికలలో కారు గుర్తుకు ఓటేసి BRS పార్టీకి మద్దతు తెలపాలని నగర ప్రజలను కోరారు. తెలంగాణ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే మరిన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. భవిష్యత్ తరాలకు బంగారు బాటలువేసే అవకాశం కల్పించిన వారవుతారని ఆయన పేర్కొన్నారు.