హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): దవాఖానల్లో శానిటేషన్, డైట్ కాంట్రాక్ట్ బిల్లులు, ఆయా సిబ్బందికి వేతనాలను సమయానికి చెల్లించాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆదేశించారు. ఆలస్యమైతే సూపరింటెండెంట్లదే బాధ్యత అని స్పష్టంచేశారు. ఆదివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టీవీవీపీ దవాఖానల పనితీరుపై నెలవారీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. శానిటేషన్ చార్జీలను ఒక్కో బెడ్కు రూ.5వేల నుంచి రూ.7,500కు, డైట్చార్జీలను రూ.40 నుంచి రూ.80కి పెంచామని గుర్తు చేశారు. దవాఖానల్లో పారిశుద్ధ్యం మెరుగుపడాలని, రోగులకు నాణ్యమైన భోజనం అందించాలని స్పష్టం చేశారు. డైట్ మెనూను తెలుగులో అందరికీ కనబడేలా ఏర్పాటు చేయాలని, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇచ్చే డైట్ వివరాలు పొందుపరచాలని చెప్పారు. శానిటేషన్, డైట్ పర్యవేక్షణ బాధ్యతలను రాష్ట్ర స్థాయిలో ఒక అధికారికి అప్పగించాలని సూచించారు. 171 దవాఖానల్లో ఇప్పటివరకు 152 దవాఖానలకు శానిటేషన్, 162 దవాఖానలకు డైట్ కాంట్రాక్టులు ఖరారయ్యాయని, మిగతావి త్వరలో పూర్తవుతాయని తెలిపారు.
రోగులతో ప్రేమగా మాట్లాడాలి
దవాఖాన సిబ్బంది రోగులతో దురుసుగా ప్రవర్తించినా, డబ్బు డిమాండ్ చేసినా చర్యలు తప్పవని హరీశ్రావు హెచ్చరించారు. రోగులు, సహాయకులతో నర్సులు ప్రేమగా, నవ్వుతూ మాట్లాడాలని హితవుచెప్పారు. ఎంత పెద్ద దవాఖాన కట్టినా, ఆధునిక పరికరాలు సమకూర్చినా, చకటి డాక్టర్లు ఉన్నా.. స్టాఫ్ నర్సులు, ఆయాలు, శానిటేషన్ సిబ్బంది, డైట్ సిబ్బంది ప్రవర్తన బాగాలేకపోతే ఉపయోగం ఉండదని పేర్కొన్నారు. డిశ్చార్జి అయ్యే రోగులకు డాక్టర్ ప్రిసిప్షన్ మేరకు ఉచితంగా మందులు ఇవ్వాలని స్పష్టంచేశారు. 56 టిఫా స్కానింగ్ మెషీన్లు త్వరలో అందుబాటులోకి వస్తాయని, గర్భిణులకు ఇకపై దవాఖానల్లోనే స్కానింగ్ నిర్వహించాలని ఆదేశించారు. రాత్రివేళ్లలో పోస్ట్ మార్టమ్ను వెంటనే ప్రారంభించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 719 మంది సీనియర్ రెసిడెంట్లను జిల్లాల్లో నియమించామని చెప్పారు. 133 మంది మిడ్వైఫరీ నర్సులకు 18 నెలల శిక్షణ ఇచ్చామని, త్వరలోనే వారి నియామకాలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో హెల్త్ సెక్రటరీ రిజ్వీ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ శ్వేతామహంతి, డీఎంఈ రమేశ్రెడ్డి, టీవీవీపీ కమిషనర్ అజయ్కుమార్, టీఎఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఈడీ కౌటిల్య తదితరులు పాల్గొన్నారు.
స్పెషలిస్టు డాక్టర్లకు డిప్యూటేషన్
ఏదైనా దవాఖానలో స్పెషలిస్టు డాక్టర్లు ఎక్కువ మంది ఉంటే వారిని అవసరం ఉన్న చోటికి డిప్యూటేషన్పై పంపాలని హరీశ్రావు సూచించారు. ప్రతి దవాఖానలో తప్పనిసరిగా ఇన్ఫెక్షన్ కంట్రోల్ యూనిట్ను ఏర్పాటు చేయాలని చెప్పారు. ఆపరేషన్ థియేటర్ల స్టెరిలైజేషన్, గాలి నాణ్యత విషయంలో అలసత్వం వద్దని హెచ్చరించారు. నిధుల సమస్య లేదని, కావాల్సినన్ని సర్జికల్ పరికరాలు కొనుగోలు చేయాలని సూచించారు. డీసీహెచ్లు నిత్యం జిల్లాల్లోని దవాఖానలను పరిశీలించి, సమస్యలను ఎప్పటికప్పుడు పరిషరించాలని ఆదేశించారు.