హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): తమదేమీ నామినేటెడ్ ప్రభుత్వం కాదని, ప్రజలు ఎన్నుకొన్న ప్రజా ప్రభుత్వమని పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. రాజకీయ నేతల్లా గవర్నర్ ప్రెస్మీట్లు పెట్టి మాట్లాడటం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నవారికి కొన్ని పరిధులు, పరిమితులు ఉంటాయని, వాటికి లోబడి వ్యవహరించాల్సి ఉంటుందని చెప్పారు. అత్యుత్సాహంతో మాట్లాడటం సరికాదని అన్నారు. బుధవారం తెలంగాణభవన్లో టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్తో కలిసి మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం దేశానికి మార్గదర్శిగా నిలిచిందని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అత్యున్నత సంస్థలు రాష్ట్ర ప్రగతిని ప్రశంసించకుండా ఉండలేని పరిస్థితిని సృష్టించిన ప్రభుత్వాన్ని, ఇబ్బందిపెట్టేలా గవర్నర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్ పదవులు నామమాత్రమేనని గుర్తుచేశారు. ఈ పదవుల్లో ఉన్నవాళ్లు ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాలను ఇరకాటంలో పెట్టాలని చూడటం సరైన విధానం కాదని పేర్కొన్నారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నందున, ఆ పరిధిలో ఉండి మాట్లాడాల్సి ఉంటుందని సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా తలసాని ఉటంకించారు.
గవర్నర్ ప్రొటోకాల్ విషయంలో ఎక్కడా ఇబ్బందులు తలెత్తలేదని.. ఆ వ్యవహారాలను చూసేందుకు ప్రత్యేక విభాగమే ఉంటుందని వివరించారు. ప్రభుత్వంతో గిల్లికజ్జాలు పెట్టుకోవాలని గవర్నర్ చూడటం మంచిది కాదని చెప్పారు. గతంలో ఎన్టీఆర్ హయంలో రాంలాల్, ఢిల్లీ, పాండిచ్చేరిలో గవర్నర్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తే చివరికి ఏమైందో అందిరికీ తెలుసని పేర్కొన్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్ వంటి రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారి పట్ల సీఎం కేసీఆర్ గౌరవంగా, హుందాగా ఉంటారని.. మహిళలంటే అమితమైన గౌరవం ఉందని గుర్తుచేశారు. బాధ్యత గల స్థానాల్లో ఉన్న ఎవరైనా ప్రజాస్వామ్య వ్యవస్థలను గౌరవించాలని సూచించారు.