హైదరాబాద్ : కుల, మతాలను వీడి సమానత్వాన్ని చాటాలని చెప్పిన గొప్ప మహనీయుడు గురునానక్(Gurunanak) అని సనత్నగర్ బీఆర్స్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani )అన్నారు. సోమవారం గురునానక్ జయంతి సందర్భంగా అమీర్పేటలోని గురుద్వార్ను దర్శించుకొని సాంప్రదాయబద్ధంగా నిర్వహించిన ప్రార్థనలలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గురునానక్ దేవ్ సిక్కు మతాన్ని స్థాపించి మనిషి జీవితంలో పెను మార్పులను తీసుకురాగల బోధనలను అందించారన్నారు.
అందరూ సంక్షేమ కార్యక్రమాలు చేయాలని, దురాశను విడిచిపెట్టి నైతికంగా డబ్బు సంపాదించాలని గురునానక్ ప్రబోధించారు. ఇతరుల హక్కులను ఎప్పుడూ హరించకూడదని పేర్కొన్నారు. డబ్బును సంపాదించి ఇతరుల సంక్షేమానికి వినియోగించాలని చెప్పిన మహోన్నత వ్యక్తి గురునానక్ అని కొనియాడారు. సిక్కుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు.