హైదరాబాద్ : రానున్న ఎన్నికల్లో గోషామహల్లో గులాబీ జెండాయే ఎగురుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం రాంకోటీలోని రూబీ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన బీఆర్ఎస్ (BRS) పార్టీ గన్ ఫౌండ్రీ డివిజన్ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త ఇప్పటి నుంచే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా శ్రమించాలని పిలుపునిచ్చారు.
గోశామహల్(Goshamahal) నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరించింది, అభివృద్ధి పనులు చేసింది ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం మాత్రమేనని చెప్పారు. నియోజకవర్గ పరిధిలో బీఆర్ఎస్ నాయకులు పాదయాత్రలు చేపట్టి ప్రజల సమస్యలను తెలుసుకొని తమ దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరిస్తామని ప్రకటించారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించాలని సూచించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ జిల్లా ఆత్మీయ సమావేశాల ఇన్చార్జి దాసోజు శ్రవణ్, నియోజకవర్గ ఇన్చార్జి నందు బిలాల్, మాజీ కార్పొరేటర్ మమతా సంతోష్ గుప్తా , సీనియర్ నాయకులు ప్రేమ్ సింగ్ రాథోడ్, నాయకులు సంతోష్ గుప్తా, శ్రీనివాస్ యాదవ్, ధన్ రాజ్, శాంతాబాయి, సరస్వతి, అనిత తదితరులు పాల్గొన్నారు.