హైదరాబాద్ : మత్స్యకారులకు పూర్తి హక్కులు కల్పించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani) అన్నారు. రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య వైస్ చైర్మన్ గా దీటి మల్లయ్య శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి తలసాని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ( Chief Minister KCR) నాయకత్వంలో రాష్ట్రంలో మత్స్య సంపద గణనీయంగా పెరిగిందని అన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచితంగా చేప, రొయ్య పిల్లల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని వెల్లడించారు. చేపల విక్రయాలు జరుపుకోవడానికి సబ్సిడీ (Subcidy)పై వాహనాలు అందించామని, చేపల వంటకాలపై మహిళా (Womens) మత్స్యకారులకు ఉచితంగా శిక్షణ నిర్వహించామని ఆయన తెలిపారు. మృగశిర కార్తె సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ (Fish Food Festival) ను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని మత్స్యకారులకు ఏడాది పొడవునా ఉపాధి కల్పిస్తున్నామని వివరించారు.
దళారులకు తక్కువ ధరకు చేపలను అమ్ముకొని నష్టపోవద్దని సూచించారు. కులవృత్తుల అభివృద్ధి కి అండగా తెలంగాణ ప్రభుత్వం ఉంటుందని అన్నారు. మాసాబ్ ట్యాంక్ లోని మత్స్య శాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.