హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): భారత స్వాతంత్ర వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 14 నుంచి 24 వరకు రాష్ట్రలోని 582 థియేటర్లలో ‘మహాత్మాగాంధీ’ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించనున్నట్టు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. వజ్రోత్సవాల ప్రారంభ సమయంలో విద్యార్థుల్లో జాతీయ స్ఫూర్తిని పెంచేలా గాంధీ చిత్రాన్ని సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఉచితంగా ప్రదర్శించగా, లక్షలాది మంది విద్యార్థులు వీక్షించినట్టు వివరించారు. విద్యార్థులను థియేటర్ల వద్దకు ఉచితంగా తీసుకెళ్లి, వారు క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చిన విషయాన్ని గుర్తు చేశారు. ముగింపు ఉత్సవాల సందర్భంగా చిత్రాన్ని అన్ని వర్గాల ప్రజలు వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. 15, 20 తేదీల్లో చిత్ర ప్రదర్శన ఉండదని చెప్పారు.