శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ పరమభక్తుడైన రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్నో ఆధ్యాత్మిక సంకేతాలు. అవన్నీ సార్వభౌముడిని ఉలికిపాటుకు గురిచేస్తాయి. నారసింహుడి ఆనవాళ్లను వెతికేలా ఉసిగొల్పుతాయి. ఆ ప్రయాణంలో ఓ తాపసి తారసపడతాడు. ఓ గిరిపుత్రుడి మాటలు కూడా కొత్త ఆలోచనలు రేకెత్తిస్తాయి. అంతలోనే నర్మగర్భంగా మాట్లాడుతున్న ఓ బాలకుడు ప్రభువుల వారికి దిశానిర్దేశం చేస్తాడు. మరోపక్క ,రాజ్యంలో అల్లకల్లోలం. హొయసల విష్ణువర్ధనుడు దండయాత్రకు ఏర్పాట్లు మొదలుపెడతాడు.
అద్భుతమైన ఫలితాలను ఇవ్వగలిగే దీక్ష..
‘నరసింహ స్వామి దీక్ష’
ఇంతకు ముందు ఎవరైనా ఈ దీక్షను చేపట్టారా? స్వామి వారి కరుణను పొందారా.. తనకు తెలియదు. తనకు తెలిసిందల్లా కలియుగంలో కనిపించే దేవుడు శ్రీ నారసింహుడు!
రామభట్టుకు నారసింహుని దీక్షను తలచుకుంటేనే, తనువెల్లా ఒక దివ్య భావనతో పులకిస్తున్నది.
విద్యాపతి ఆలోచన వేరు. తన ముందు కూర్చున్న ఈ వృద్ధుడు.. త్రిభువనమల్లుని మనసు
మార్చివేశాడు.
‘రాజ్యపాలనలో ప్రజాసంక్షేమం కోసం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయంలో నరసింహస్వామి భక్తుడిగా మారిపోయాడు. అసలు ఈ మనిషి నిజంగానే స్వామివారిని కలలోనైనా దర్శించాడా? లేదా ఏ ఉన్మాద మానసిక స్థితిలోనో తనకు తానే ఊహించుకున్నాడా? ఈ వృద్ధుడు చెబుతున్నట్టుగా ఈ రాజ్యంలోని ఆ ప్రదేశంలో శ్రీ నారసింహుడు కొలువై ఉన్నాడా?
వాస్తవమా.. నమ్మకమా..?
లేక నిద్రలో కలవరింతా?’
అనేక ప్రశ్నలు.. విద్యాపతికి ఒక్కక్షణం ఏమీ తోచలేదు.
“రామశర్మ గారూ! మీకు కుల వివక్ష లేదనీ, మీకు అందరూ సమానమేనని నేను గ్రహించగలిగాను. త్రిభువనమల్లుని పాలనలో ఏకైక సూత్రం.. అందరూ సమానులే అని! దానికి మరొక మాటలేదు. కానీ, మీరు కలగన్న నరసింహ స్వామి గుహ ఏ గుట్టపైన ఉంది? ఏ కొండపైన ఉంది? మిమ్మల్ని నమ్మి, ప్రభువులవారు ఒంటరిగా సింహదేవుని అన్వేషణలో ఆ కొండప్రాంతానికి
వెళ్లిపోయారు”
“ఎవర్ని నమ్మి?” ప్రశ్నించాడు రామభట్టు.
“నిన్ను.. నీ మాటల్ని నమ్మి” కోపంగా అన్నాడు విద్యాపతి.
“కాదు విద్యాపతి గారూ.. త్రిభువన చక్రవర్తి స్వామివారి అన్వేషణకు బయలుదేరింది నా మాటల్ని నమ్మి కాదు”.. స్థిరంగా పలికాడు రామభట్టు.
“నిన్ను కాకపోతే.. మరి, ఎవర్ని నమ్మి వెళ్లారు?”
“సాక్షాత్తూ.. స్వామివారిని నమ్మి” అన్నాడు రామభట్టు.
‘ఈ రామభట్టు చెబుతున్నది నిజమేనా?’
“కవివరేణ్యా! మీ సందేహం నాకు అర్థమైంది. మనకోసం ఉన్నాడు అనుకునేవాడు ఉన్నాడా లేడా..? అని మీరు అనుకుంటున్నారు. అవునా?” నవ్వుతూ అడిగాడు రామభట్టు.
“స్వామి ఉన్నాడని తెలుసు. కానీ, మన రాజ్యంలో వెలిసి ఉన్నాడా అని నా సందేహం?”
“మీ సందేహం తీరాలంటే.. నన్నేం
చేయమంటారు?”
“ఇప్పుడు మీరు చేయవలసింది, నేను చెప్పవలసింది ఏమీ లేదు. మీరు కలగని, మీరు స్వామి వారిని కనులారా చూసి, అది నిజమనుకొని ఇక్కడికి వచ్చారు. త్రిభువనమల్లు ప్రభువులవారి మనసులో ఒక బీజం నాటారు. ఆయన మానసిక స్థితిని అల్లకల్లోలం చేశారు. ఎంతవరకంటే.. వ్యాధితో బాధ పడుతున్న పదేండ్ల కొడుకుని, ప్రాణంలా చూసుకునే పట్టపురాణీ వారిని, చివరకు పరిపాలిస్తున్న రాజ్యాన్ని, పరిపాలననే వదిలేసి వెళ్లేంతగా! దీనికి ఎవరు బాధ్యులు, ఎవరు బాధితులు! మీరు కన్న ‘కల’.. ఇలలో ఇన్ని సమస్యలు సృష్టిస్తుంటే.. ఈ పరిస్థితులను ఎవరు సరిచేయాలి?” ఆవేదనా పూరితమైన స్వరంతో ప్రశ్నించాడు విద్యాపతి.
పరిస్థితిని గ్రహించాడు రామభట్టు.
నిజమే! తను ఊహించని పరిస్థితులే
ఏర్పడ్డాయి.
తను అనుకున్నది వేరు.
తనకు స్వామివారు కలలో దర్శనమిచ్చారు. కానీ, తనకది కలలా అనిపించలేదు. సాక్షాత్తూ కళ్లముందే బొమ్మ కట్టినట్టు కనిపించింది.
అదే.. తను ప్రభువులవారి దృష్టికి తీసుకొచ్చాడు. చక్రవర్తికి, రాజ్యానికి దీనివల్ల మేలు జరుగుతుందని తను బలంగా విశ్వసించాడు.
కానీ.. విద్యాపతి భావన వేరుగా ఉంది.
“విద్యాపతిగారూ, నాకు స్వామివారు కలలో కనిపించారు. అది నిజం. నేనొక్కణ్ణీ లేదా మా కుటుంబ సభ్యులతో వెళ్లి కష్టాలు పడైనా.. స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. కానీ, ఎందుకో నాకు అలా అనిపించలేదు. పొలంలో లంకెబిందెలు దొరికితే ఎవరైనా సరే, అది అధికారులకు అప్పగించాలి. రాజ్యంలో దొరికే నిధి నిక్షేపాలు ఏవైనా అవి రాజ్యసంపదగా పరిగణించబడతాయి. అది శాసనం. అందుకే నేను ఈ దైవనిధిని ప్రభువులకు చేర వేయడం నా విధి అని అనుకున్నాను”
“రామభట్టు గారు, దానికీ, దీనికీ
ఏమిటి సంబంధం?”
“దేవుడు ఏ ఒక్కరి సొత్తూ కాదు, కాకూడదు. గుహలో వెలసిన ప్రాచీనమైన విగ్రహంలో ఉన్న దేవదేవుడు అందరికీ చెందాలని నేను భావించాను. త్రిభువనమల్ల ప్రభువులు ఆ కొండమీద ఉన్న గుహను దర్శిస్తే, స్వామివారి అనుగ్రహాన్ని పొందితే, అది అందరికీ క్షేమమని నాకనిపించింది. మీకు తెలియని విషయం కాదు. సంకల్పం, శౌర్యం, భక్తీ, ప్రవర్తనా ఇంకా చెప్పాలంటే పరిపాలించే రాజుగారి సమస్త జీవితమూ.. రాజుగారికి చెందవు. అవి వారు పరిపాలించే ప్రజలకు చెందుతాయి. మేలు చేస్తాయి. త్రిభువనమల్ల చక్రవర్తి జీవితం, సాధన ఆయనకు, ఆయన కుటుంబసభ్యులకు మాత్రమే పరిమితం కాదు. అది ప్రజలందరిదీ! అది భగవన్నిర్ణయం. ఆ విషయం భగవంతుడికీ తెలుసు. భక్తుడైన చక్రవర్తికీ తెలుసు.
అందుకే.. శ్రీ నరసింహ స్వామివారి స్వప్న దృశ్యాన్ని చక్రవర్తుల వారికి చేరవేశాను”
మౌనంగా విన్నాడు విద్యాపతి.
“సరే, అయితే ప్రభువులవారు తిరిగి వచ్చేంత వరకు మీరు మా అతిథిగా, మీకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కుటీరంలో ఉండాలి”
సైనికాధికారికి వినబడేటట్టుగా పెద్దగా అన్నాడు విద్యాపతి.
వెంటనే సైనికులు వచ్చి రామభట్టుకు అటూ, ఇటూ నిలబడ్డారు. అర్థమైంది రామభట్టుకి.
“నిర్బంధమా?”
“కాదు.. అనుబంధం. వీరిని తీసుకొనిపోయి, కుటీరంలో ఉంచండి. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు వీరు అక్కడినుంచి బయటికి రావడానికి అనుమతి లేదు. ఇది రాణీగారి అదేశం”
కఠినంగా చెప్పాడు.
రామభట్టు సైనికులను అనుసరించాడు.
వెనుక నుంచి అన్నాడు విద్యాపతి.
“రామభట్టుగారు, ఇది మీ దీక్షకు పరీక్ష అనుకోండి. ప్రభువులవారు త్వరగా తిరిగి రావాలని మీరు నమ్మే నరసింహ దేవుణ్ణి ప్రార్థించండి”
రామభట్టు ఒక్క క్షణం కనులు మూసుకున్నాడు. అతి భయంకర రాక్షస శక్తిని సమూలంగా నిర్మూలించేందుకు స్తంభం నుంచి పైకి దూకినవాడు, పసివాడైన ప్రహ్లాదునికి అభయం ఇచ్చి, అన్ని భయాల్నీ పోగొట్టినవాడు. ఆ దేవదేవుడు శ్రీ నారసింహుడు.. తనకు కనిపించిన కల తనకే స్వంతం కాదు. అది అందరికీ దర్శన భాగ్యం కలిగించాలి. ప్రతీవ్యక్తి, తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, పెంచి పోషించిన సమాజానికి, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు, పెద్దలకు, మాతృభూమికి రుణపడి ఉంటారు. ఎవరైనా సరే, ఆ రుణం తీర్చుకోవాల్సిందే.. అందుకే మనం స్వామిని శరణు కోరాలి.
దేవతా కార్య సిద్ధ్యర్థం సభ స్తంభా సముద్భవం
శ్రీ నృసింహం మహావీరం
నమామి ఋణ ముక్తయే
స్మరణాత్ సర్వపాపఘ్నం కద్రూజ విషనాశనం
శ్రీ నృసింహం మహావీరం
నమామి ఋణ ముక్తయే
***
యుద్ధ సన్నాహాలు ప్రారంభమయ్యాయి. విష్ణువర్ధనుడి రాజ్యంలో శాంతలా దేవికి ఎందుకో పదే పదే మనసులో అనిపిస్తున్నది.
‘ఇది ధర్మయుద్ధం కాదని! కానీ, వద్దు అని ఎవరు చెప్పాలి రాజుగారికి, ఆయనకు స్వయంగా స్ఫురిస్తే తప్పా తన నిర్ణయం
మార్చుకోడు’.
సభా ప్రాంగణంలో యుద్ధ ప్రణాళికల గురించి తీవ్రమైన చర్చ జరుగుతున్నది.
“ప్రభూ! ఏది ఏమైనా త్రిభువనమల్లుడి శక్తిని, యుక్తినీ, సైనిక పాటవాన్నీ, ఆర్థిక వనరులను తక్కువగా అంచనా వేయరాదు. ప్రత్యక్షంగా కాకపోయినా, పరోక్షంగా మన హొయసల రాజ్యం.. భువనగిరి సామ్రాజ్యానికి, త్రిభువనమల్ల చక్రవర్తికి సామంత రాజ్యంగానే భావిస్తుంటారు. కనుక..” ప్రభువు ఇష్టపడని నిష్ఠుర సత్యాన్ని వినయంగానే చెప్పాడు ధర్మాధికారి.
ధర్మాధికారి పదవి న్యాయవ్యవస్థలో ఉన్నతమైంది. హొయసల రాజ్యంలో న్యాయ విచారణలు, తీర్పులను ప్రకటించడంలో ధర్మాధికారిదే ప్రధాన పాత్ర. ఆయన నిర్ణయాలపైనే రాజు విష్ణువర్ధనుడి శాసనాలు, శిక్షలు ఆధారపడి ఉంటాయి.
రాజ్య విస్తరణ కాంక్ష బలంగా ఉన్న మహారాజుకి యుద్ధ ప్రణాళికలో ఉన్న సాధ్యాసాధ్యాలు వివరించడానికి మంత్రులకు, దండనాయకులకు ఎవరికీ ధైర్యం సరిపోదు. అందుకే రాజుగారు ఎంతగానో గౌరవించే ధర్మాధికారి అందరి అభిప్రాయాన్నీ తన నిశ్చితాభిప్రాయంగా చెప్పవలసి వచ్చింది.
ఒక్క క్షణం ఆలోచించాడు విష్ణువర్ధనుడు.
‘యుద్ధానికి వెళ్తే కానీ ఓటమో, గెలుపో తెలుసుకోలేము. ఒడ్డున నిలబడి మీనమేషాలు లెక్క పెట్టేవాడికి ఈత ఎప్పటికీ రాదు. మునగడానికి సిద్ధమైతేనే నీటిలో తేలడానికి అవకాశం ఉంటుంది. కానీ, ఒక్కోసారి ఆవేశపూరితంగా తీసుకొనే నిర్ణయాలు విపరీత పరిణామాలకు దారి తీస్తాయి. సాహసం అవసరమే కానీ, దుస్సాహసం పనికిరాదు. కానీ, విజయానికి, అపజయానికి సరిహద్దు గీత చాలా సన్నం. అయితే ఏం చేయాలి?’ విష్ణువర్ధనుడి మౌనం, యుద్ధం వద్దనడానికి అంగీకారం అనుకున్నారు సభాసదులు. ఒక్కసారిగా సభలో ఆవేశం రెక్కలు విప్పుకొంది.
“ప్రభూ! యుద్ధానికి సిద్ధపడని ఏ దేశమూ స్థిరంగా నిలబడదు. గెలుస్తామా? ఓడిపోతామా? అని క్షణక్షణం సందేహాలతో సతమతం అయ్యేకంటే, విజయమో.. వీరస్వర్గమో తేల్చుకోవడం మంచిది” తన గుండెలమీద కుడి పిడికిలితో గట్టిగా కొట్టుకుంటూ దృఢంగా పలికాడు దండనాయకుడు కేశవ నాయకుడు.
“భళా.. కేశవ నాయకా! నీ ప్రభుభక్తి గొప్పది”
చిరునవ్వుతో అన్నాడు మహారాజు.
ఆ మాటకు ఉప్పొంగి పోయాడు కేశవ నాయకుడు.
“మా భక్తి ప్రదర్శనకు తమరి అనుమతి కోరుతున్నాం”
కనుసైగతోనే ‘సరే’ అన్నాడు మహారాజు.
అప్పుడు మొదలైందొక అద్భుత విన్యాసం.
కేశవ నాయకుడు మాటలు ముగించక ముందే, అతనిపైకి పెద్దకత్తితో ఎగిరి దూకాడు.. ఇంకొక యోధుడు. ఆ దెబ్బకి అతని తల తెగి పడేదే! కానీ, మెరుపులా మరొక యోధుడు అతని మీదుగా తలకిందులుగా పడ్డాడు. కేశవ నాయకుడి మెడమీద పడవలసిన కత్తిదెబ్బ, ఈ యోధుడి భుజంమీద పడింది. సర్రున చెయ్యి సగం దాకా కోసుకొని పోయింది. ఒక్కసారిగా పదిమంది వీరులు పైకప్పు నుంచి ఊడి పడ్డట్టుగా గాల్లోకి ఎగిరి దూకారు. కేశవ నాయకుడు ముందుకు మెల్లిగా నడుస్తూ వెళ్తున్నాడు. అతనిపైన గురిపెట్టిన పదిమంది చేతుల్లోని ఆయుధాలను ఎగరగొట్టేస్తున్నారు ఇద్దరు మెరికల్లాంటి యువ కిశోరాలు. నూనూగు మీసాల యవ్వనంతో ఉన్న ఆ యువకుల కళ్లలో కనిపిస్తున్న చురుకుదనం చూసి ఆశ్చర్య చకితుడయ్యాడు విష్ణువర్ధనుడు. విన్యాసాన్ని ఆపమన్నట్టుగా సైగ చేశాడు.
అందరూ ఎక్కడి వారక్కడ ఆగిపోయి, తిరిగి ఒక వరుసలో నిలబడ్డారు.
“ఏమిటిదంతా?” విస్మయంగా ప్రశ్నించాడు ధర్మాధికారి.
“అందరికీ వందనాలు.. ప్రభువులవారి వ్యక్తిగత రక్షణకై ప్రత్యేక శిక్షణ పొందిన ‘గరుడ’ దళం” అనే కంఠం సభా ప్రాంగణంలో మార్మోగింది.
“గరుడ?”
“అవును.. గరుడ దళం.
ప్రభువులవారిని అనుక్షణం కనిపెట్టుకొని ఉండే మహాదళం.. గరుడ”