మెదక్: సంక్షేమ పథకాల అమలులో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దళిత బంధు ద్వారా దళిత సమాజం అభ్యున్నతికి పాటుపడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. అన్నివర్గాల ప్రజల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ అనునిత్యం కృషిచేస్తున్నారని తెలిపారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా మెదక్ కలెక్టరేట్లో మంత్రి తలసాని జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.
సెప్టెంబర్ 17ను పురస్కరించుకొని జాతీయ సమైక్యత ఉత్సవాల ప్రాధాన్యత ప్రజలు, విద్యార్థులకు తెలియజేయాలన్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధులు మెదక్ జిల్లాలో ఎంతో మంది ఉన్నారని చెప్పారు. నిజం సర్కార్ ఆంక్షలను ధిక్కరించి ఆగస్టు 15న జాతీయ జెండాలను రెపరెపలాడించారని వెల్లడించారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలోని సబ్బండ వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నదని మంత్రి తలసాని చెప్పారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను ఉచితంగా అందిస్తున్నామన్నారు. రైతుల కోసం రైతు బంధు, రైతుబీమా, ఆసరా పథకం ద్వారా అర్హులైన వారందరికీ పింఛన్లు, పేదింటి ఆడపిల్లల పెండ్లిళ్లకు కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ ద్వారా లక్ష రూపాయలు,
మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందిస్తున్నామని వెల్లడించారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును తెలంగాణ సచివాలయానికి నామకరణం చేయడంతో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని చెప్పారు.