హైదరాబాద్: హైదరాబాద్ నగర ప్రజలను త్వరలో మరో పురాతన కట్టడం కనువిందు చేయనుంది. రాష్ట్రంలోని పురాతన కట్టడాల సంరక్షణలో భాగంగా నగరంలోని మోంజామార్కెట్, మోండా మార్కెట్, మీరాలం మండిని ప్రభుత్వం ఇప్పటికే పునరుద్ధరించింది. తాజాగా బన్సీలాల్ పేటలోని పురాతన మెట్లబావిని బాగుచేస్తున్నది. ఈ బావిని ఆగస్టు 15న ప్రారంభిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.
పురపాలక ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్తో కలిసి బన్సీలాల్పేట్లో ఉన్న పురాతన మెట్ల బావిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హైదరాబాద్లో 60 పురాతన మెట్లబావులు ఉన్నాయని చెప్పారు. ఇప్పటికే ఆరు పురాతన మెట్లబావులను పునరుద్ధరించామని వెల్లడించారు. ఆగస్టు 15న బన్సీలాల్పేట మెట్లబావిని తిరిగి ప్రారంభిస్తామన్నారు. ఆరు నెలల నుంచి బావిలో పుడిత వెళికితీత పనులను నిర్వహిస్తున్నామన్నారు. సుమారు 800 లారీల చెత్తను ఇందులో నుంచి తొలగించామన్నారు.
3 వందల ఏండ్ల చరిత్ర కలిగిన ఈ మెట్లబావి బన్సీలాల్పేటలోని నల్లపోచమ్మ దేవాలయం ఎదురుగా ఉన్నది. దీనిని నాగన్నకుంట మెట్లబావి అని పిలిచేవారు. చెత్తా చెదారం, వ్యర్థాలతో పేరుకుపోయిన బావిని జీహెచ్ఎంసీ అధికారులు పునరుద్ధరిస్తున్నారు. బావి పరిసరాలను శుభ్రం చేస్తున్నారు. మూడు అంతస్తులలో ఉన్న ఈ బావిలో మెట్లు, అందమైన శిల్పాలు, ఆకట్టుకునే రాతి నిర్మాణాలు ఉన్నాయి. నిజాం కాలంలో నిర్మించిన ఈ బావి అప్పట్లో పరిసర ప్రాంతాల ప్రజలకు తాగునీరు అందించింది.